బుద్ధి చెప్పినందుకు చెయ్యిని నరికేశారు
బెంగళూరు: ఇంటి ముందు గొడవ చేస్తున్న సమయంలో మంచి మాటలు చెప్పిన ఇంటి యజమాని చెయ్యి రెండుగా నరికివేసిన సంఘటన బెంగళూరు నగర శివార్లలోని తావరకెరె పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇంటి యజమాని మంగళగౌరి అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నదని పోలీసులు తెలిపారు. మాగడి రోడ్డులోని కెంపేగౌడ నగరలో మంగళగౌరికి ఐదు ఇండ్లు ఉన్నాయి. ఐదు ఇండ్లు అద్దెకు ఇచ్చిన ఆమె అక్కడే నివాసం ఉంటున్నారు.
మంగళగౌరి ఇంటిలో చంద్రు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి అక్కడే నివాసం ఉంటున్న కృష్ణ, కుమార్ అనే ఇద్దరు ఇంటి ముందు నిలబడి గొడవ చేస్తున్నారు. ఆ సమయంలో చంద్రు వెళ్లి మంగళగౌరికి విషయం చెప్పాడు. ఆమె బయటకు వచ్చి ఇక్కడ గొడవ చెయ్యరాదని సలహా ఇచ్చింది.
అక్కడి నుండి కృష్ణ, కుమార్ వెళ్లి పోయారు. గురువారం ఇద్దరు కత్తులు, కొడవలి తీసుకుని మంగళగౌరి ఇంటి దగ్గరకు వెళ్లారు. తరువాత మంగళగౌరి మీద దాడి చేశారు. ఆమె ఎడమ చేతిని అడ్డం పెట్టడంతో కొడవలితో నరికివేశారు. చెయ్యి రెండు ముక్కలు అయ్యింది.
వెంటనే స్థానికులు కిందపడిన చెయ్యిని, మంగళగౌరిని తీసుకుని సుంకదకట్టలోని ఆసుపత్రికి చేరుకున్నారు. మూడు గంటల పాటు ఆపరేషన్ చేసిన వైద్యులు రెండు ముక్కలు అయిన చేతిని అతికించారు. సుమారు ఆరు నెలల పాటు మంగళగౌరి చికిత్స తీసుకోవాలని వైద్యులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.