యూపీఏ కన్నా మెరుగ్గా మోడీ సర్కార్ 'అందరికీ ఇళ్ల పథకం'..
2014నుంచి ఇళ్ల నిర్మాణంలో గణనీయంగా వృద్ది కనిపిస్తోంది. ఎన్డీయే సర్కార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం ప్రవేశపెట్టిన తర్వాతనే ఇది సాధ్యపడింది.
న్యూఢిల్లీ: దేశంలో అందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. 2022వరకు దేశంలో ప్రతీ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించాలన్న ఉద్దేశంతో మోడీ సర్కార్ పనిచేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటికే అమలులో ఉన్న రాజీవ్ ఆవాస్ యోజన, ఇందిరా ఆవాస్ యోజన, తదితర పథకాల ద్వారా వీటి నిర్మాణం జరగనుంది.
ఈ పథకాల కింద నిర్మించే ఇళ్లకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాలన్న నిబంధన ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నిర్మించే అర్బన్ హౌజింగ్ స్కీములకు సబ్సిడీలను కూడా కేంద్రం అందించనుంది. దీంతో పాటు కేంద్రం ప్రవేశపెట్టిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ తో పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కొనుక్కొనే కస్టమర్లకు కూడా పూర్తి భరోసా లభించనుంది.
రూరల్ హౌజింగ్:
గ్రామీణ ప్రాంత ప్రజలకు పక్కా ఇళ్లు లేదా ఉన్నవాటికే మరమ్మత్తులు చేయాలన్న ఉద్దేశంతో 1985లో ఇందిరా ఆవాస్ యోజన పథకం ప్రారంభమైంది. 2016-17నాటికి ఈ కార్యక్రమం పీఎంఏవై(ప్రధానమంత్రి ఆవాస్ యోజన) పరిధిలోకి వచ్చింది. ఈ పథకం కింద 2019నాటికి సుమారు 1కోటి పక్కా ఇళ్లను నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా ఇరుకు ఇళ్లలో, ఏమాత్రం నివాసయోగ్యం కానీ ఇళ్లల్లో నివసిస్తున్న వారికి ముందుగా ఈ పథకం వర్తింపజేయాలని భావిస్తున్నారు.
ఇదే నేపథ్యంలో కొన్ని సవరణలు కూడా చేసింది కేంద్రం. ఈ పథకం కింద నిర్మించే ఇళ్లన్ని కనీసం 25స్క్వేర్ మీటర్ల పరిధిలో ఉండాలని నిర్ణయించింది. అంతకుముందు నిర్మించిన ఇళ్ల పరిణామం 20స్క్వేర్ మీటర్లుగా ఉండేది. దాంతో పాటు ఒక్కో ఇంటికి వెచ్చించే మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. గతంలో ఇచ్చిన రూ.70వేల స్థానంలో ఇప్పుడు రూ.1లక్షా 20వేలను ఇవ్వడానికి నిర్ణయించింది.
యూపీఏ-2 కన్నా మెరుగ్గా ఎన్డీయే:
గడిచిన రెండేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇళ్ల నిర్మాణం గణనీయంగా పెరిగినట్లు మనం గమనించవచ్చు. గత యూపీఏ-2 పదేళ్ల హయాంలో ఇందిరా ఆవాస్ యోజన కింద(ఐఏవై) కేవలం 10లక్షల ఇళ్లను మాత్రమే నిర్మించారు. దీనితో పోలిస్తే.. తాజా ఎన్డీయే ప్రభుత్వం గడిచిన ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 28లక్షల ఇళ్లను దేశవ్యాప్తంగా నిర్మించింది.
2014నుంచి ఇళ్ల నిర్మాణంలో గణనీయంగా వృద్ది కనిపిస్తోంది. ఎన్డీయే సర్కార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం ప్రవేశపెట్టిన తర్వాతనే ఇది సాధ్యపడింది. అయితే స్వచ్చ భారత్, స్కిల్ ఇండియా లాంటి కార్యక్రమాల తరహాలో విజయాలను సాధించాలంటే పీఎంఏవై పథకం కూడా మరింత మెరుగుపడాల్సిన అవసరముంది. 2019నాటికి దేశంలో కోటి పక్కా ఇళ్లను గనుక కేంద్రం నిర్మించగలిగితే.. ఆపై ఈ సంఖ్యను మరింత పెంచకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరముంది.
అర్బన్ హౌజింగ్:
పట్టణ ప్రాంతాల్లో పీఎంఏవై కింద నిర్మించే ఇళ్లకు సబ్సిడీ కూడా అందనుంది. కేంద్రం తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ హౌజింగ్ సెక్టార్ కు మరింత లబ్ది చేకూర్చనుంది. ఈ ఏడాది కొత్త సంవత్సరం ఆరంభంలో క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్(సీఎల్ఎస్ఎస్) పథకాన్ని మరింత విస్తరించనున్నామని ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అర్బన్ హౌజింగ్ స్కీమ్ కింద 4శాతం, 3శాతం లెక్కన రూ.9లక్షల నుంచి రూ.12లక్షల వరకు రుణాలు అందించడానికి కేంద్రం హామి ఇచ్చింది. దీంతో రుణగ్రహీతకు సుమారు మూడింటిలో రెండో వంతు భాగం లబ్ది చేకూరనుంది. ఈ మొత్తం ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే లబ్దిదారులకు అందుతుంది.
బడుగు బలహీన వర్గాలకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఆర్థికంగా అంత స్థోమత లేనివారు(ఎకనమికల్ వీకర్ సెక్షన్స్-ఎన్.వి.ఎస్), తక్కువ ఆర్థిక సంపాదన ఉన్నవారు(లో ఇన్ కమ్ గ్రూప్స్) దీని ద్వారా లబ్ది పొందను్న్నారు.
ద్రవ్యోల్బణం తగ్గించడం, జన్ ధన్ ఖాతాలను ప్రవేశపెట్టడంతో లబ్ది:
గడిచిన మూడేళ్లలో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం పరోక్షంగా వడ్డీ రేట్లపై ప్రభావం చూపడంతో ఇది సాధ్యపడింది. ఇక జన్ ధన్ ఖాతాలు వచ్చాక చాలామంది బ్యాంకులో ఖాతాలు తెరిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఖాతాల్లో లావాదేవీలు ఒక పరిధి వరకు మాత్రమే పరిమితం కావడంతో.. వీటి ద్వారా ఇళ్ల రుణాలు లేదా వ్యక్తిగత రుణాలు ఎంతమేర పొందవచ్చుననే దానిపై అనుమానాలు నెలకొన్నాయి.
ఇక పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు కొనుగులు చేసేవాళ్లకు బిల్డర్స్ పెద్ద సమస్య. సకాలంలో పూర్తి చేయకపోవడం.. నిర్మాణంలో తరుచూ జాప్యం జరుగుతుండటం వారిని ఆందోళనకు గురిచేస్తుంటాయి. కస్టమర్ నుంచి పూర్తి స్థాయిలో డబ్బు ముట్టిన తర్వాత కూడా సకాలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో చాలామంది బిల్డర్స్ ఫెయిల్ అవుతున్న పరిస్థితులు ఇప్పటికీ అనేకం. అయితే కేంద్రం తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ తో ఈ పరిస్థితికి చెక్ పడనుంది.
పూర్తి డబ్బులు ముట్టిన తర్వాత కూడా సకాలంలో ఇళ్లు పూర్తి చేసి ఇవ్వడంలో బిల్డర్ విఫలమైతే.. కస్టమర్ ఇచ్చిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తాన్ని తిరిగి బిల్డర్ కస్టమర్ కు పెనాల్టీ కింద చెల్లించాల్సి ఉంటుంది.
చివరగా చెప్పేదేమంటే!:
పీఎంఏవై పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా అటు పేదలకు పక్కా ఇళ్లు లభించడంతో పాటు అదే సమయంలో కొన్ని వేల మందికి భవన నిర్మాణ రంగంలో ఉపాధి దొరుకుతోంది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ స్కీమ్ అటు కస్టమర్లకు భరసానిచ్చేదిగా ఉండటంతో ఈ రంగంలో మరింత వృద్ది రేటు నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తంగా అందరికీ ఇళ్ల పథకంలో ఎన్డీయే ప్రభుత్వం విజయవంతంగా తొలి అడుగును పూర్తి చేయబోతోంది. అయితే మరో సంవత్సర కాలం పాటు ఈ పథకం పనితీరును గమనిస్తే తప్ప అప్పుడే ఓ అంచనాకు రావడం కష్టం.
(నితిన్ మెహతా-మేనేజింగ్ పార్ట్నర్, రన్నితి కన్సల్టింగ్ అండ్ రీసెర్చీ,ప్రణవ్ గుప్తా-ఇండిపెండెంట్ రీసెర్చర్)