‘మరో నిర్భయ మరణించేదాకా ఎదురుచూడాలా?’
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా దేశరాజధానిలో మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు, యువతులకు, బాలికలకు రక్షణ లేకుండా పోతోందని మండిపడ్డారు. ఢిల్లీలో ఇంకెంతమంది నిర్భయలుగా మారాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులను నిలదీశారు.
మరో నిర్భయ మరణించేదాకా ఎదురుచూస్తూనే ఉండాలా? అంటూ స్వాతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశరాజధానిలో ఇటీవల 14ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులపై కేసు పెట్టారు. అయితే కేసు విచారణకు కొద్ది సేపటి ముందు బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెతో బలవంతంగా యాసిడ్ లాంటి ద్రావణాన్ని తాగించారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక చికిత్స పొందుతూ మృతిచెందింది.
ఈ ఘటన నేపథ్యంలోపోలీసులపై కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్భయ లాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్న పోలీసుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదంటూ ఆరోపించారు. మహిళా భద్రతపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేయాలని స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు.