షీనా హత్య: మూడేళ్ల మిస్టరీ ఇలా..? ఇంద్రానీ క్లోజ్వ్యక్తితో గర్భవతి!
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిమిషానికో ట్విస్ట్ కనిపిస్తోంది. మూడేళ్ల కిందటి మిష్టరీని పోలీసులు చేధించారు. షీనా బోరా 2012 నుంచి కనిపించడం లేదు. అయినప్పటికీ అదృశ్యమైనట్లు ఎలాంటి ఫిర్యాదు లేదు.
సోదరుడు మిఖాయిల్ బోరా, మారు తండ్రి పీటర్ ముఖర్జీయా, ఇతర బంధువులకు ఆమె అమెరికా వెళ్లినట్లు తల్లి ఇంద్రాని చెప్పింది. తల్లి మాటల పైన మిఖాయిల్కు అనుమానం వచ్చింది. సోదరి షీనా హఠాత్తుగా అమెరికా వెళ్లిన విషయమై అతను ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఓసారి మిఖాయిలో బోరా తన తల్లి ఇంద్రానీని సోదరి షీనా గురించి అడిగాడు. ఆమె నుండి ఓ ఫోన్ లేదు ఓ సందేశం లేదన్నాడు. అప్పటి నుంచి గౌహతిలో నివసిస్తున్న తన అమ్మానాన్నలతో, కొడుకు మిఖాయిల్తో మాట్లాడటం దాదాపు మానేసింది.
తన కూతురు షీనాను తన మూడో భర్త పీటర్కు ఇంద్రానీ సోదరిగా పరిచయం చేసింది. ఆమె ఇంద్రానీ కూతురు అనే విషయం ఆయనకు తెలియదు. తన కొడుకు రాహుల్, షీనాలు రిలేషన్ షిప్లో ఉండటం ఇటు పీటర్, అటు ఇంద్రానీకి నచ్చలేదు. వారు వరుసకు అన్నాచెల్లెల్లు అవుతారు.
ఆ తర్వాత హఠాత్తుగా మూడేళ్ల తర్వాత ఇప్పుడు పోలీసులు ఇంద్రానీని అరెస్టు చేశారు. సమాచారం మేరకు.. ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. షీనా బోరా మూడేళ్లుగా కనిపించడం లేదని ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పారు. ఓ గ్రామస్థులు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది.
రాకేష్ మారియా తన జూనియర్ అధికారులను కేసు విచారణ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత పోలీసులు ఎవరినీ ప్రత్యేకంగా అనుమానించలేదు. కానీ, ఇంద్రానీతో పాటు అందరి పైన నిఘా ఉంచారు.
ఇంద్రానీ డ్రైవర్ కదలికలను కూడా గత మూడు నెలలగా పోలీసులు గమనించారు. అప్పుడే, షీనా బోరాకు ఏమో అయిందనే విషయం వారికి అర్థమైంది.
ఆగస్టు 21వ తేదీన పోలీసులు ఇంద్రానీ డ్రైవర్ శ్యాం రాయ్ను అరెస్టు చేశారు. అతనిని అక్రమాయుధాల కేసు కింద అరెస్టు చేశారు. అతనిని పోలీసులు విచారించారు. అదే విచారణలో షీనా బోరాను తాను 2012లో హత్య చేసినట్లు అంగీకరించాడు.
అంతేకాదు, ఈ హత్యకు కీలక సూత్రధారి ఇంద్రానీ అని చెప్పాడు. షీనాను గొంతు పిసికి చంపేసినప్పుడు సంజీవ్ ఖన్నా అక్కడే ఉన్నాడని చెప్పాడు. డ్రైవర్ శ్యాం రాయ్ నుంచి సమాచారం సేకరించిన పోలీసులు ఆ తర్వాత ఇంద్రానీని అరెస్టు చేశారు. ఆమెను ఆగస్టు 25న ముంబైలోని ఆమె ఇంట్లో అరెస్టు చేశారు.
ఆమె కూడా నేరాన్ని అంగీకరించింది. ఇంద్రానీ అరెస్టు అనంతరం ఆమె మాజీ భర్త (రెండో భర్త) సంజీవ్ ఖన్నాను కోల్కతాలో అరెస్టు చేశారు. సమాచారం మేరకు ఖన్నా కూడా తన నేరాన్ని అంగీకరించాడని తెలుస్తోంది.
పోలీసులకు నిందితులు ఏం చెప్పారు?
ఇంద్రానీ, ఆమె డ్రైవర్ పోలీసులకు షీనా హత్య గురించి చెప్పారు. తన భర్త పీటర్ ముఖర్జియా తనయుడు రాహుల్ ముఖర్జియాతో తన కూతురు షీనాకు రిలేషన్ షిప్ ఉందని, దీంతో డ్రైవర్, మాజీ భర్త సహకారంతో హత్య చేసినట్లు అంగీకరించిందని తెలుస్తోంది.
షీనా కేసు సవాల్
పోలీసులకు షీనా బోరా కేసు సవాల్ అని చెప్పవచ్చు. ఇంద్రానీకి, ఇతర నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు రాబట్టడం పోలీసులకు ఇప్పుడు కష్టంగా మారిందని చెబుతున్నారు. పోలీసులు షీనాను కాల్చివేసిన ప్రాంతానికి డ్రైవర్ను తీసుకు వెళ్లారు.
ఇది పరువు హత్యనా లేక కార్పోరేటర్ హత్యనా?
రాహుల్తో రిలేషన్ షిప్ వల్ల షీనాను హత్య చేసినట్లు ఇంద్రాని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇది పరువు హత్యగా భావిస్తున్నారు. అదే సమయంలో ఆస్తి కోసం అనే వాదన వినిపిస్తోంది. దీంతో దీనిని పోలీసులు చేధించాల్సి ఉంది.
అప్పటికి షీనా గర్భిణీ
షీనా హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. హత్యకు గురైన సమయంలో షీనా గర్భవతి అని తెలుసక్తోంది. గర్భిణి కావడం వల్లనే షీనాను ఆమె తల్లి ఇంద్రాని హత్య చేయించినట్లుగా సమాచారం. తాను గర్భిణిని అని, పిల్లలను కనాలనుకుంటున్నానని చెప్పిందని, ఇంద్రానికి బాగా క్లోజ్గా ఉండే వ్యక్తితో తాను గర్భం ధరించానని చెప్పిందని తెలుస్తోంది.
అప్పటికే షీనా అతడితో థాయ్లాండుకు వెళ్లి వచ్చినట్లు వెల్లడించింది. షీనాకు పీటర్ ముఖర్జియా తనయుడు రాహుల్తో రిలేషన్ షిప్ ఉన్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుందామని వారు అనుకుంటుండగా ఈ హత్య జరిగింది. తాను గర్భవతిని అని షీనా ఆమెకు తల్లికి చెప్పాకే ఈ హత్య చేయించిందని తెలుస్తోంది.