తల్లిపాలకు నోచుకోని శిశువుల కోసం: జైపూర్లో "తల్లి పాల బ్యాంకు"
జైపూర్: తల్లిపాలకు నోచుకోని పిల్లల కడుపు నింపడం కోసం రాజస్ధాన్లో తల్లిపాల బ్యాంకుని ఏర్పాటు చేశారు. తల్లిపాల బ్యాంకు అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? తల్లుల నుంచి పాలు సేకరించి, భద్రపరిచి.. వాటిని అవసరమైన శిశువులకు అందించే క్రమంలో జైపూర్లోని మహిళా చికిత్సాలయంలో ‘‘తల్లిపాల బ్యాంకు'' ఏర్పాటు చేశారు.
నార్వేకు చెందిన ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో రాజస్థాన్ ప్రభుత్వం ‘‘జీవన్ ధార'' పథకం పేరిట ఈ బ్యాంకును సమర్థవంతంగా నిర్వహిస్తోంది. మానవ వనరులు ఉంటే, మౌలిక వసతులు కల్పిస్తామని నార్వే సంస్ధ హామీ ఇచ్చిందని ఆసుపత్రి ఇంఛార్జ్ డాక్టర్ షీలా శర్మ చెప్పారు. జైపూర్లో ఉన్న ఈ తల్లిపాల కేంద్రం దేశంలోనే రెండవదిగా గుర్తింపు పొందింది.
అప్పుడే పుట్టిన పసికందులకు తల్లిపాలను మించిన పోషకాహారం లేదన్నారు. చాలా వ్యాధుల నుంచి శిశువుని కాపాడే శక్తి తల్లిపాలకు మాత్రమే ఉందన్నారు. పుట్టిన బిడ్డకు ఆరు నెలలు వచ్చేవరకైనా తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలన్నారు.
కొంతమంది శిశువులు పుట్టగానే అనారోగ్యంతో తల్లి చనిపోయి అనాథలుగా మారిపోయే ప్రమాదం ఉంది. అలాంటి వారి కోసం ఈ ‘‘జీవన్ ధార'' కేంద్రం ఏర్పాటైంది. తల్లిపాలకు నోచుకోని దేశవ్యాప్తంగా 30 శాతం మంది పిల్లలకు ఉచితంగా తల్లిపాలు అందిస్తున్నారు. తల్లుల నుంచి సేకరించిన పాలను డీప్ఫ్రీజర్లో దాచి పాలలో పోషకాలు తగ్గకుండా చూసుకుంటున్నట్లు జీవన్ ధార కేంద్రం అధికారులు తెలిపారు.