అవును ఏజెంట్నే: శివసేన కసబ్ వ్యాఖ్యలపై కులకర్ణి
ముంబై: తనను పాకిస్తాన్ ఏజెంట్గా, కసబ్కు మరో రూపంగా శివసేన అభివర్ణించడంపై సుదీంధ్ర కులకర్ణి మంగళవారంనాడు స్పందించారు. తాను భారత్, పాకిస్తాన్ మధ్య శాంతికి ఏజెంట్ను అని, పార్టీ భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించానని ఆయన అన్నారు.
తాను ఈ రోజు సామ్నా చదివానని, దాని భావప్రకటనా స్వేచ్ఛను తాను గౌరవిస్తున్నానని, రాజకీయ పార్టీకి అధికారిక పత్రిక అయిన సామ్నా భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తున్నానని ఆయన అన్నారు. తనను సామ్నా ఏజెంట్గా అభివర్ణించిందని, తాను దక్షిణాసియా దేశాల మధ్య శాంతికి ఏజెంట్ను అని ఆయన మీడియాతో అన్నారు.
శివసేన కూడా ఇతరుల భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని, తమతో ఏకీభవించని వారి పట్ట అవమానకరంగా ప్రవర్తించకూడదని ఆయన అన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న విభేదాలను తొలగించడానికే తాను పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి కుర్షీద్ మహ్మూద్ పుస్తకావిష్కరణను ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు.
మన ప్రధాని బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దక్షిణాసియా దేశాల మధ్య అనుబంధం పెంచడానికి ప్రయత్నిస్తున్నారని, రష్యాలో నవాజ్ షరీప్ను కలిసి అవగాహనకు వచ్చారని, పాకిస్తాన్తో సంబంధాలను మెరుగు పరుచుకోవాలని భారత్ ప్రయత్నిస్తోందని దాన్ని బట్టి అర్థమవుతోందని ఆయన అన్నారు .