నన్ను నేను రక్షించుకొనేందుకే భర్తను కాల్చాను: హాంసవేణి
నేనేందుకు నా భర్తపై కాల్పులు జరుపుతాను? తాగిన మైకంలో భర్త కొడుతోంటే రక్షించుకొనేందుకు ఫైరింగ్ చేసినట్టుగా శుక్రవారం సాయంత్రం భర్త సాయిరామ్ పైన కాల్పులు జరిపిన హంసవేణి పోలీసులకు తెలిపారు.
బొమ్మనహళ్ళి: నేనేందుకు నా భర్తపై కాల్పులు జరుపుతాను? తాగిన మైకంలో భర్త కొడుతోంటే రక్షించుకొనేందుకు ఫైరింగ్ చేసినట్టుగా శుక్రవారం సాయంత్రం భర్త సాయిరామ్ పైన కాల్పులు జరిపిన హంసవేణి పోలీసులకు తెలిపారు.
శనివారం నాడు ఆమెను పోలీసులు విచారణ కోసం చందాపుర సమీపంలో ఉన్న సూర్యసిటీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బ్యాంకు పనిమీద తాను, తన భర్త సాయిరామ్ తో కలిసి హూసూర్ వెళ్లి హరళూరులో ఉన్న తమ నివాసానికి తిరిగి వస్తున్నట్టు చెప్పారామె.
అయితే చందాపుర సమీపంలో రెస్టారెంట్ లో ఇద్దరం మద్యం తాగినట్టు చెప్పారు. భర్త ఆరు పెగ్గుల విస్కీ. తాను రెండు బీర్లు తాగినట్టు చెప్పారు. మద్యం తాగుతున్న సమయంలోనే ఇద్దరి మధ్య గొడవైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అయితే అదే సమయంలోనే రెస్టారెంట్ లో ఆయన రివాల్వర్ తీసి తన ముఖం మీద కొట్టినట్టు చెప్పారు.
దీంతో తనకు గాయాలైనట్టు చెప్పారామె. కారులో వెళ్తున్న సమయంలో కూడ మళ్ళీ గొడవ జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పారు. అయితే భర్త నుండి తనను తాను రక్షించుకొనేందుకుగాను ఆయనపై కాల్పులు జరిపినట్టుగా హంసవేణి పోలీసులకు చెప్పారు.
హంసవేణిది బెంగుళూరు . కాగా, సాయిరామ్ ది ఆంధ్రప్రదేశ్. 27 ఏళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకొన్నట్టుగా ఆమె పోలీసులకు చెప్పారు. రెండు కుటుంబాలు బాగా డబ్బున్న కుటుంబాలు కావడంతో మద్యం సేవించే అలవాటు ఉందని ఆమె పోలీసులకు చెప్పారు.