థరూర్ తప్పులకు నిందపడ్డానన్న సునంద, పాక్ తరర్తో రిలేషన్పై..
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం శుక్రవారం నాడు ప్రముఖ జర్నలిస్ట్ నళినీ సింగ్ను విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను ఐపీఎల్, పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్ తదితర అంశాల గురించి సిట్ ప్రశ్నించింది.
ఐపీఎల్ కోచ్చి జట్టుకు సంబంధించిన వివాదంలో శశిథరూర్ చేసిన తప్పులకు తాను నిందను భరించాల్సి వచ్చిందని సునందా తనకు చెప్పినట్లు మహిళా జర్నలిస్టు నళినీ సింగ్ శుక్రవారం చెప్పారు.
ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడానికి ఒక రోజు ముందు సునందా పుష్కర్ ఐపిఎల్ వివాదం గురించి తన వద్ద ప్రస్తావించినట్లు శుక్రవారం తనను ప్రశ్నించిన సిట్కు నళినీ సింగ్ చెప్పారు. నళినీ సింగ్ను పోలీసులు గంటకుపైగా విచారించారు.
సునంద మృతికి ముందు ఆమె తనతో చెప్పిన విషయాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారని నళినీ చెప్పారు. ఐపీఎల్ కోణంలోను అడిగారన్నారు. పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్తో శశిథరూర్కు ఉన్ సంబంధాల పైన సునందకు తెలుసునని చెప్పారు.
ముఖ్యంగా శశి, తరర్లు దుబాయ్లో మూడు రోజులు ఉన్నారని సునంద చెప్పారని, అందుకు తాను ఆధారాలు అడిగానని, అప్పుడు సునంద.. తనకు దుబాయ్లో చాలామంది స్నేహితులు ఉన్నారని చెప్పారని తెలిపారు.
కాగా, ఒకప్పటి ఐపిఎల్ కోచ్చి ఫ్రాంచైజీ వ్యాపార విధానం, దాని చుట్టూ ఉన్న వివాదాన్ని అర్థం చేసుకోవడానికి సిట్ ఢిల్లీ పోలీసుకు చెందిన ఆర్థిక నేరాల విభాగం సాయం తీసుకోవచ్చని తెలుస్తోంది. సునందా మృతికి, ఐపీఎల్ వివాదానికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని కూడా దర్యాప్తు అధికారులు పరిశీలించనున్నారు.