ఆర్ కే నగర్ లో విజయం ఎవరిదో మీరే చూడండి: జయ మేనకోడలు దీపా !
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో అమ్మ వారసులు ఎవరు ? అనే విషయం తమిళనాడుకు తెలుస్తోందని, అమ్మ పేరు చెప్పుకుని కాలం గడుపుతున్న వారికి కార్యకర్తలు తగిన బుద్ది చెబుతారని దీపా అన్నారు.
చెన్నై: జయలలిత నిజమైన వారసురాలు తానే అని ఆమె మేనకోడలు దీపా జయకుమార్ అంటున్నారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో అమ్మ వారసులు ఎవరు ? అనే విషయం తమిళనాడుకు తెలుస్తోందని దీపా చెప్పారు. అమ్మ పేరు చెప్పుకుని కాలం గడుపుతున్న వారికి కార్యకర్తలు తగిన బుద్ది చెబుతారని దీపా అన్నారు.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారికి చిత్తసుద్ది ఉందా ? అని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ప్రశ్నించారు. జయలలిత మీద అభిమానం ఉంటే ఆమె కుటుుంబ సభ్యులకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు.
అమ్మ మీద అభిమానంతో ఆర్ కే నగర్ నియోజక వర్గం ప్రజలు ఉంటే వారిని మభ్య పెట్టడానికి శశికళ వర్గం ప్రయత్నిస్తోందని దీపా జయకుమార్ పరోక్షంగా మండిపడ్డారు. అమ్మ అభిమానులు నా వెంట ఉన్నారని దీపా ధీమా వ్యక్తం చేశారు.
జయలలిత ప్రాణాలతో లేకున్నా ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలే నన్ను గెలిపిస్తాయని, అందులో ఎలాంటి సందేహం లేదని దీపా అన్నారు. తన దగ్గర డబ్బు లేకపోయినా అమ్మ ఇచ్చిన అభిమానులు, కార్యకర్తలు తనకు అండగా ఉన్నారని దీపా జయకుమార్ అంటున్నారు.