సంచలనం :రెండేళ్ళు పూర్తయ్యాక గవర్నర్ పదవిని వదులుకొంటా, సిఎంతో విబేధాలే కారణమా?
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామికి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి మద్య ప్రఛ్చన్నయుద్దం సాగుతున్న తరుణంలో వచ్చే ఏడాది తాను తన పదవిని వదులుకొంటానని ఆమె ప్రకటించడం సంచలనం సృష్టించింది.
పాండిచ్చేరి :పుదుఛ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది తన పదవిని వదులుకోనున్నట్టు ప్రకటించారు. లెఫ్టినెంట్ గవర్నర్ గా వచ్చే ఏడాదితో రెండేళ్ళు పూర్తి కానున్న నేపథ్యంలో తాను తన పదవిని వదులుకోనున్నట్టు ఆమె ప్రకటించారు. కొంత కాలంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ మద్య ప్రఛ్చన్న యుద్దం సాగుతోంది. ఈ తరుణంలో కిరణ్ బేడీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకొంది.
బిజెపిలో చేరిన తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్రర్ గా గత ఏడాది కిరణ్ బేడీకి బాద్యతలను కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ మేరకు ఆమె ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ గా కొనసాగుతున్నారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామితో ఆమెకు విబేధాలున్నాయి. ఇద్దరి మద్య కొనసాగుతున్న ప్రఛ్చన్న యుద్దం బహిరంగంగా మారింది. ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఆమె ఇటీవలనే షాకిచ్చారు.
అధికారిక కార్యకలాపాల కోసం సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ ముఖ్యమంత్రి ఇటీవల ఆదేశించాడు. అయితే ఈ ఆదేశాలను చెల్లవని కిరణ్ బేడీ స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం కిరణ్ బేడీ అధికారిక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది. ఈ గ్రూప్ ద్వారానే ఆమె ప్రజల సమస్యలను తెలుసుకొంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది.
ముఖ్యమంత్రికి చెక్ పెడుతున్న లెఫ్టినెంట్ గవర్న్
ఢిల్లీ రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం ఏ రకమైన ఆరోపణలు లెఫ్టినెంట్ గవర్నర్ పై చేసిందో, అదే తరహ ఆరోపణలను పుదుచ్చేరిలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడ చేస్తోంది.రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేలా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో సమాంతర పాలనను నడిపించేలా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలను కూడ లెఫ్టినెంట్ గవర్నర్ పై అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా ముఖ్యమంత్రికి నచ్చడం లేదు.
సోషల్ మీడియాతో లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీ బాద్యతలను స్వీకరించిన తర్వాత అధికారిక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు.ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారానే ఆమె అధికారులకు ఆదేశాలు ఇస్తుంటారు.అయితే పౌరసరఫరాలశాఖకు చెందిన ఓ అధికారి ఈ వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల మేసేజ్ లు వీడియోను పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్టు ను చూసిన ఆమె అతణ్ణి విధుల నుండి తప్పించాలని ఆదేశించారు. ఆమె ఆదేశాల మేరకు ఆయనను విధుల నుండి తప్పించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలు చెల్లవు
అధికారిక కార్యక్రమాలకు సోషల్ మీడియాను ఉపయోగించకూడదని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదేశాలను జారీ చేశాడు. అయితే ఈ ఆదేశాలను లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలు చెల్లవని తేల్చి చెప్పేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీ ఈ రకమైన ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలతో ఎన్నుకొన్న తమ పరిస్థితి ఏమిటని ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రశ్నించారు. లెఫ్టినెంట్ గవర్నర్ తీరుపై కాంగ్రెస్ నాయకులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
హోంమంత్రికి కాంగ్రెస్ ఫిర్యాదు
కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వ్యవహరశైలిని వారు కేంద్ర హోంశాఖ మంత్రి దృస్టికి తీసుకెళ్ళారు.రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును వారు తప్పుబట్టారు . ఈ మేరకు రాష్ట్రంలో చోటుచేసుకొన్న ఘటనలను ఆమె ప్రస్తావించారు. ఈ మేరకు కొన్ని ఆధారాలను కూడ హోంమంత్రికి వారు సమర్పించారు.
రెండేళ్ళు పూర్తిచేసి పదవిని త్యజిస్తా
రెండేళ్ళ పాటు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని పూర్తిచేసిన తర్వాత తన పదవిని వదులుకొంటానని కిరణ్ బేడీ ప్రకటించారు. 2018 మే 29వ, తేదితో కిరణ్ బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా భాద్యతలు స్వీకరించి రెండేళ్ళు పూర్తి అవుతోంది. రెండేళ్ళు పూర్తైన తర్వాత తన పదవిని వదిలిపెట్టనున్నట్టు ఆమె ప్రకటించారు.ముఖ్యమంత్రి నారాయణస్వామికి, ఆమెకు మద్య పొసగడం లేదు.కాంగ్రెస్ నేతలు కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదుచేసిన రోజునే ఆమె తన పదవి త్యాగం విషయమై ప్రకటించడం చర్చనీయాంశమైంది. పరిసరాల పరిశుభ్రత, అవినీతి నిర్మూలన కోసం ఆమె తీసుకొన్న చర్యలు ప్రశంసలు పొందాయి.