తమిళనాడు ప్రభుత్వం రద్దు చెయ్యాలి: ఎవరిసత్తా ఏమిటో చూద్దాం: దీపా !
తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని జయలలిత మేనకోడలు దీపా డిమాండ్ చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లో అన్నాడీఎంకే పార్టీలో చేరనని దీపా స్పష్టం చేశారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని దీపా జయకుమార్ డిమాండ్ చేశారు.
తాను ఎట్టి పరిస్థితుల్లో అన్నాడీఎంకే పార్టీలో చేరనని అన్నారు. తాను ఇప్పటికే ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై సంస్థను స్థాపించానని చెప్పారు. చెన్నైలో దీపా మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే నాయకులు తమ పార్టీలో రావాలని ఆహ్వానిస్తే మీరు ఆ పార్టీలో చేరుతారా అని మీడియా ప్రశ్నించగా తాను ఎట్టిపరిస్థితిలో అన్నాడీఎంకే పార్టీలో చేరని దీపా తేల్చి చెప్పారు.
తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చెయ్యండి
జయలలిత అధికారంలో తీసుకు వచ్చిన ఈ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చెయ్యాలని దీపా జయకుమార్ డిమాండ్ చేశారు. తమిళనాడులో మళ్లీ కొత్తగా శాసన సభ ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తెలిసిపోతుందని దీపా అన్నారు.
జయలలిత ముఖం చూసి ఓట్లు వేశారు
జయలలిత ముఖం చూసి తమిళనాడు ప్రజలు అన్నాడీఎంకే పార్టీకి ఓట్లు వేశారని, అమ్మను అధికారంలోకి తీసుకు వచ్చారని, ఇప్పుడున్న నాయకులను చూసి ప్రజలు ఎవ్వరూ ఓట్లు వెయ్యలేదని దీపా జయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో ఉంటా
జయలలిత ఆశయాలు, అమ్మ అభిమానుల కష్టాలు తీర్చడానికి తాను రాజకీయాల్లో ఉంటానని దీపా జయకుమార్ తేల్చి చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, అమ్మ అభిమానుల కోసం ఎన్ని కష్టాలు అయినా ఎదుర్కొంటానని దీపా అన్నారు.
పోలీసులు రాలేదు
ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పేరుతో తాను ఎవ్వరినీ మోసం చెయ్యలేదని దీపా జయకుమార్ స్పష్టం చేశారు. తనను చెన్నై పోలీసులు ఇప్పటి వరకు విచారించలేదని, కనీసం సంప్రదించలేదని ఆమె వివరించారు.
ఆయన ఎవరూ
తన మీద ఫిర్యాదు చెయ్యడానికి నాశపాక్కం జానకీరామన్ ఎవరూ అని దీపా ప్రశ్నించారు. తాను ప్రజల సోమ్ము స్వాహా చేశానని జానకీరామన్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఇదోక రాజకీయ డ్రామా అని దీపా మండిపడ్డారు.
దీపా కోసం త్యాగం చేశా
తాను మొదట అన్నాడీఎంకే పార్టీ నాయకుడని, జయలలిత మరణించిన తరువాత తానే స్వచ్చందంగా ఆపార్టీ నుంచి బయటకు వచ్చి దీపా పేరవై స్థాపించానని నాశపాక్కం జానకీరామన్ అంటున్నారు.
రూ. 20 కోట్లకు పైగా వసూలు చేశారు
ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పేరుతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది సభ్యత్వం తీసుకున్నారని, అలా వచ్చిన సభ్యత్వంలో రూ. 20 కోట్లకు పైగా దీపా స్వాహా చేశారని నాశపాక్కం జానకీరామన్ ఆరోపిస్తున్నారు.