జీపులో ఎక్కడానికి నేనేమి చిల్లరదొంగను కాను.. నడిచే వస్తా:శశికళ
తానేమి చిల్లర దొంగను కానని, అవసరమైతే ఎంత దూరమైనా నడిచి వస్తాను గానీ జీపు మాత్రం ఎక్కనని శశికళ తెగేసి చెప్పారట.
బెంగుళూరు: వేసిన ఎత్తులు.. అనుకున్న వ్యూహాలు.. అన్ని అనుకున్నట్లుగా అమలై ఉంటే ఈపాటికి తమిళనాడు చిన్నమ్మ గుప్పిట్లో ఉండేది. కానీ ఇప్పుడు చిన్నమ్మే పరప్పన జైల్లో బంధీ కావాల్సి వచ్చింది. ఆఖరికి ప్రత్యేక ఖైదీగా ఉండేందుకు కూడా అనుమతి నిరాకరించడంతో సామాన్య ఖైదీలతో పాటు ఆమె జైలు జీవితం గడపాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో శశికళ జైలు జీవితం గురించి జాతీయ మీడియా ఓ ఆసక్తికర వార్తను వెలువరించింది. జైల్లో సాధారణ ఖైదీల్లాగే తనను చూడటాన్ని శశికళ ఇష్టపడట్లేదనేది దాని సారాంశం. ముఖ్యంగా జైల్లోకి తీసుకెళ్లేటప్పుడు శశికళను జీపులో ఎక్కాల్సిందిగా కోరగా ఆమె నిరాకరించినట్లు అందులో పేర్కొన్నారు.
తానేమి చిల్లర దొంగను కానని, అవసరమైతే ఎంత దూరమైనా నడిచి వస్తాను గానీ జీపు మాత్రం ఎక్కనని శశికళ తెగేసి చెప్పారట. అంతేకాదు అన్నట్లుగానే వదిన ఇళవరసి, సుధాకరన్ లతో కలిసి జైల్లోకి నడుచుకుంటూనే వెళ్లారు.
కాగా, గతంలో జయలలితతో కలిసి జైలుకు వచ్చినప్పుడు శశికళ జైల్లో ప్రత్యేక హోదాను అనుభవించిన సంగతి తెలిసిందే. జయలలితతో సమానంగా శశికళ కూడా అన్ని సౌకర్యాలు పొందారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా వేరు. సాధారణ ఖైదీలాగే ఆమె కూడా జైలు జీవితాన్ని గడపాల్సి వస్తోంది. కట్టుకోవడానికి తెల్ల చీర ఇచ్చినా.. శశికళ ఆ చీరను కట్టుకోలేదని తెలుస్తోంది.