రవి పుణ్యతిథి: భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి పుణ్యతిథి (పెద్ద కర్మ) కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం జరిగింది. కుణిగల్ సమీపంలోని దోడ్డ కోప్పలు గ్రామంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పూజలు మొదలైనాయి. బెంగళూరు నుండి రవి భార్య కుసుమా, మామ హనుమంతరాయప్ప వెళ్లారు.హనుమంతరాయప్ప లింగాయుతుల సంప్రదాయాల ప్రకారం పూజ సామాగ్రిని వెంట తీసుకు వెళ్లారు. ఐఏఎస్ అధికారి మరణించి శుక్రవారానికి 11 రోజులు అయ్యింది. ఈ సందర్బంగా రవి సమాధి దగ్గర పాలు పోసి పూజలు చేశారు.
రవి భార్య కుసుమా, రవి తల్లి గౌరమ్మ రోదిస్తునే కార్యక్రమం ముగించారు. వారు కన్నీరుమున్నీరుగా పూజలు పూర్తి చేశారు. రవి అక్క భారతి, అన్న రమేష్, తండ్రి కరియప్పను ఓదార్చడం ఎవ్వరి వలన సాధ్యం కాలేదు. కోలారు, చిక్కబళ్లాపురం, బెంగళూరు, తుమకూరు, హాసన్, రామనగర, మండ్య, మైసూరు జిల్లాల నుండి వేలాది మంది రవి అభిమానులు పుణ్య తిథి కార్యాక్రమానికి హాజరైనారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యుడు డి. నాగరాజు, జేడీఎస్ నాయకుడు హెచ్.డి. రేవణ్ణ, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
తహసిల్దార్ శంభులింగయ్య దగ్గర ఉండి కార్యక్రమాలు జరిపించారు. మధ్యాహ్నం రవి ఇంటి దగ్గర అన్నదానం నిర్వహించారు. ముందు జాగ్రత చర్యగా డీఎస్పీ నేతృత్వంలో రవి సమాధి దగ్గర, దోడ్డ కోప్పలు గ్రామంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రవి జ్ఞాపకార్థం ఆయన అభిమానులు ఉచిత ఆంబులెన్స్ ను పేదలకు అందించారు. కోలారు సమీపంలోని వెలగలబుర్ర గ్రామానికి చెందిన ఎస్.భైరప్ప, ఫకీర్ సాబ్ కలిసి సుగటూరు గ్రామస్తుల కోసం ఉచిత ఆంబులెన్స్ అందించారు. జిల్లా కలెక్టర్ గా రవి ఈ ప్రాంతానికి చేసిన సేవలకు గుర్తుగా ఈ ఆంబులెన్స్ పేద ప్రజలకు అందించామని దాతలు తెలిపారు.