ఆ జవాను మద్యానికి బానిస, నేరచరితుడు: బీఎస్ఎఫ్
సరిహద్దులో కాపలా కాస్తున్న సైనికులకు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ తేజ్ బహదూర్ యాదవ్ అనే జవాను చేసిన ఆరోపణలపై బీఎస్ఎఫ్ స్పందించింది.
శ్రీనగర్: సరిహద్దులో కాపలా కాస్తున్న సైనికులకు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ తేజ్ బహదూర్ యాదవ్ అనే జవాను చేసిన ఆరోపణలపై బీఎస్ఎఫ్ స్పందించింది. ఆరోపణలు చేసిన కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్.. పదే పదే నేరాలకు పాల్పడే వ్యక్తి అని తెలిపింది.
ఇంత ఘోరమా!: సైనికులకు ఇలాంటి తిండి పెడుతున్నారా!?
2010లో సీనియర్ అధికారిపై తుపాకి గురిపెట్టినందుకు ఆయనకు సైనిక కోర్టు 89 రోజుల కఠిన కారాగార శిక్ష కూడా విధించిందని వెల్లడించింది. యాదవ్ కుటుంబం, పిల్లలను దృష్టిలో ఉంచుకుని అప్పుడు విధుల నుంచి తొలగించకుండా ఉపేక్షించినట్లు స్పష్టం చేసింది. యాదవ్పై మద్యపానం, అవిధేయత తదితర అంశాలకు సంబంధించి మరిన్ని ఫిర్యాదులు ఉన్నట్లు బీఎస్ఎఫ్ ఐజీ డీకే ఉపాధ్యాయ తెలిపారు.
యాదవ్ ఇప్పటికే స్వచ్ఛంద పదవీవిరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారని.. జనవరి 31న విధుల నుంచి వైదొలగనున్నారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ శిబిరంలో జవాన్ల నుంచి ఆహారానికి సంబంధించిన ఫిర్యాదులు అందలేదని, తాజాగా జరిపిన ప్రాథమిక విచారణలోనూ ఎవరూ నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేయలేదని వెల్లడించారు.
ఆరోపణలపై విచారణ పారదర్శకంగా జరగడానికి యాదవ్ను మరో కేంద్రానికి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. ఆహారం విషయంలో మన్నిక, నాణ్యత పరీక్షలు జరుగుతాయని.. జవాన్ల అభిరుచిని బట్టి శాకాహార, మాంసాహారాలు అందజేస్తామని వివరించారు.
సైన్యం కోసం కేంద్రం కేటాయిస్తున్న నిధులను జేబుల్లో నింపుకుంటున్న అధికారులు.. నాసిరకం తిండి పెట్టి తమను క్షోభకు గురిచేస్తున్నారని బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో కూడా వైలర్గా మారింది. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ స్పందించింది.