జశోదా బెన్ కోరిక: మోడీ ఏమంటారు, పిలుస్తారా?
అహ్మదాబాద్: ఆయన పిలిస్తే తాను వెళ్తానని ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ అంటున్నారు. ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన కోరికను వెల్లడించారు. 43 ఏళ్ల కిత్రం మోడీ, జశోదా బెన్ విడిపోయారు. మోడీ పిలిస్తే తప్పకుండా ఆయన వెంట వెళతానని ఆయన భార్య జశోదా బెన్ వెల్లడించారు. మోడీకి తనపై ప్రేమ ఉందని అందుకే ఎన్నికల అఫిడవిట్లో తన పేరు రాశారని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, నరేంద్ర మోడీ ఆమెను తన వద్దకు ఆహ్వానిస్తారా, ఆహ్వానిస్తే ఎప్పుడు, ఎలా ఆహ్వానిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోతో కలిసి ఉండాలని తనకు ఉందని, తనతో కొత్త జీవితం ప్రారంభించాలని ఉందని జశోదా బెన్ తెలిపారు. ఆయనకు సేవ చేయాలని ఉందని, ఒక్కసారి రమ్మని పిలిస్తే సంతోషంగా ఆయన వెంట వెళతానని ఆమె చెప్పారు. తాను ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి ఒక్కసారి రమ్మని పిలవగానే మరుక్షణం ఆయన వెంట వెళ్లి జీవితాంతం తోడు ఉంటానని జశోదాబెన్ చెప్పారు. కానీ ముందు ఆయన తనను పిలవాలి కదా అని ఆమె అన్నారు.
43 ఏళ్లపాటు విడిగా ఉంటున్నా భర్తపై మమకారం తగ్గలేదని, తన పూజలన్నీ ఆయన కోసమేనని జశోదా బెన్ చెప్పారు. ఇప్పటికీ వారంలో నాలుగు రోజులు ఆమె ఉపవాసం ఉంటారు. 1968లో మోడీకి 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జశోదా బెన్తో వివాహమైంది. మూడేళ్ల తర్వాత వారిద్దరూ విడిపోయారు. తండ్రి సహకారంతో ఆమె చదువుకుని ఓ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా ఆమె కొత్త జీవితం ప్రారంభించారు. ప్రస్తుతం ఆమెకు 63 ఏళ్లు. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు.
ఇటీవల లోక్సభ ఎన్నికల వరకు తన వివాహం గురించి గానీ, భార్య గురించి గానీ మోడీ ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. వడోదర స్థానం నుంచి లోక్సభకు మోడీ పోటీ చేసిన సమయంలో ఎన్నికల అఫిడవిట్లో తన భార్య పేరు జశోదా బెన్ అని తొలిసారి ఆయన వెల్లడించారు. ఆఫిడవిట్లో తన భార్యగా తన పేరును మోడీ రాశారని తెలిసినప్పుడు తన భావాలను ఓ పత్రికలో ఆమె పంచుకున్నారు. చాలా సంతోషం కలిగిందని కళ్లలో నీళ్లు వచ్చాయని జశోదాబెన్ అన్నారు. ఆయనకు నేను అంటే ఇష్టమేనని తెలుసన్నారు. ఆందుకే ఆయన తన పేరు రాశారని ఆమె చెప్పారు.
ఆమె ఎక్కడికి వెళ్లినా ఐదుగురు గుజరాత్ పోలీసులు ఆమెకు రక్షణగా అనుసరిస్తారు. మే 30వ తేదీ నుంచి ఆమెకు వారిని ఎస్కార్ట్గా నియమించారు. ఆమె ఆటోలో ప్రయాణిస్తే వారు ఆమెను అనుసరిస్తారు. అది ఆమెకు చిరాకుగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇంతకు ముందు కూడా తాను మీడియాతో మాట్లాడానని, తనకు ఎప్పుడూ ఆ సమస్య లేదని, కానీ ఇటీవల ఒత్తిడి వస్తోందని ఆమె అన్నారు. ఆ ఒత్తిడి ఎవరి నుంచి అనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు.