గెలిస్తే.. తొలి బీజేపీ రాష్ట్రపతిగా ‘ఆయన’.. ఓడిన రెండో కాంగ్రెస్ అభ్యర్థిగా ‘ఆమె’
సోమవారం జరుగుతోన్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించే తొలి బీజేపీ అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.
న్యూఢిల్లీ: సోమవారం జరుగుతోన్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించే తొలి బీజేపీ అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.
ఇక ఓటమి పాలయ్యే రెండో కాంగ్రెస్ అభ్యర్థిగా మీరా కుమార్ చరిత్రలో నిలిచిపోనున్నారు. 1969లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి పాలై.. ఈ ఎన్నికల్లో ఓటమిపాలైన తొలి కాంగ్రెస్ అభ్యర్థిగా రికార్డులకెక్కారు.
బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మరోమారు 2007లో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ తరుపున ఉపరాష్ట్రపతి భైరవ్ సింగ్ షెఖావత్ ఈ పదవికి పోటీ పడి ఓడిపోయారు.
గెలిచే తొలి బీజేపీ అభ్యర్థి.. రామ్నాథ్ కోవింద్
రాష్ట్రపతి పదవికి ఇప్పటి వరకు మొత్తం పధ్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. బీజేపీ అధికారంలో ఉండగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి పదవికి ఆ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపడం ఇదే తొలిసారి. బీజేపీ అధిష్ఠానం తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో బీహార్ గవర్నర్ గా ఉన్న కోవింద్ తన పదవికి రాజీనామా సమర్పించి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరుపున నిలుచున్నారు. బీజేపీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఈయన ఎన్నిక లంఛన ప్రయాంగా మారింది.
Recommended Video
ఓటమి పాలైన తొలి కాంగ్రెస్ అభ్యర్థి.. నీలం సంజీవరెడ్డి
రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి కాంగ్రెస్ ‘అధికార' అభ్యర్థి ఓడిపోయారు. ఆయనే నీలం సంజీవరెడ్డి. 1969లో కాంగ్రెస్ తరుపున నీలం సంజీవరెడ్డి పోటీ చేశారు. అయితే ఈయన అభ్యర్థిత్వం నచ్చని అప్పటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ ఉపరాష్ట్రపతిగా ఉన్న వీవీ గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. ఈ ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి ఓడిపోగా, కాంగ్రెస్ పార్టీ కూడా చీలిపోయింది.
రెండో అభ్యర్థిగా.. మీరాకుమార్?
నీలం సంజీవరెడ్డి తరువాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులెవరూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోలేదు. ప్రస్తుత ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా పోటీలో నిలిచిన మీరాకుమార్ కు 17 పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే ఎన్డీఏ తరుపున బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్, మీరాకుమార్ను సమర్ధిస్తున్న వివిధ పార్టీల బలాబలాలు పరిశీలిస్తే మీరా ఓటమి ఖాయమని స్పష్టమవుతోంది. ఇదే జరిగితే రాష్ట్రపతి ఎన్నికలో ఓటమిపాలైన రెండో కాంగ్రెస్ అభ్యర్థిగా మీరా కుమార్ చరిత్రకెక్కుతారు.
ఏ రాజకీయ నేపథ్యం లేకుండానే అబ్దుల్ కలాం...
ఇక 2002లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని, భారత క్షిపణి పితామహుడు అబ్డుల్ కలాం గెలిచి రాష్ట్రపతి అయ్యారు. ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉండగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రాంతీయపక్షాలు ప్రతిపాదించిన ఏపీజే అబ్దుల్ కలాంకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మద్దతివ్వగా, వామపక్షాల అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీ సెహగల్పై ఆయన గెలిచారు. రెండోసారి రాష్ట్రపతిగా కొనసాగేందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభాపాటిల్ రాష్ట్రపతి అయ్యారు.
తొలిసారిగా కులం కార్డు...
రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సమయంలో మూడు సందర్భాల్లో మాత్రమే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఎమర్జెన్సీ అనంతరం 1977లో కాంగ్రెస్ మొదటిసారి రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ పెట్టలేదు. జనతా పార్టీఅభ్యర్థిగా ముందుకొచ్చిన కాంగ్రెస్ మాజీ నేత నీలం సంజీవరెడ్డికి కాంగ్రెస్ మద్దతివ్వడంతో పోటీలేకుండా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతిగా ఆయన నిలిచారు. 2002 ఎన్నికల్లో కాంగ్రెస్ లోక్సభలో ప్రతిపక్షంలో ఉండగా, 1997లో యునైటెడ్ ఫ్రంట్ సర్కారుకు కాంగ్రెస్ బయటి నుంచి మద్దతిచ్చింది. 1997 రాష్ట్రపతి ఎన్నికలో అప్పటి ఉపరాష్ట్రపతి, కాంగ్రెస్ నేత కేఆర్ నారాయణన్కు దళితుడనే కారణంగా యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్యపక్షాలు, వామపక్షాలతో పాటు బీజేపీ మద్ధతు తెలిపాయి. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో గెలిచారు.
రెండోసారి తెరపైకి వచ్చిన కులం ప్రస్తావన...
రాష్ట్రపతి ఎన్నికల్లో మొదటిసారి 1997లో కులం తెరపైకి వచ్చింది. అప్పటి ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్. దళితుడైన ఆయన్ని ఆ కార్డుతో తొలి దళిత రాష్ట్రపతిగా చేయాలంటూ పాలక యునైటెడ్ ఫ్రంట్, కాంగ్రెస్ కోరగా.. బీజేపీ కూడా అందుకు అంగీకరించి మద్దతు పలికింది. మళ్లీ ఇరవై ఏళ్ల తరువాత.. పాలక ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ తన అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ ను ప్రకటించి.. దళిత అభ్యర్థిని గెలిపించాలనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. దీనికి పోటీగా కాంగ్రెస్ విజయావకాశాలు లేకపోయినప్పటికీ దళిత వర్గానికే చెందిన మీరా కుమార్ ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. దళిత్ వర్సెస్ దళిత్ అంటూ ప్రచారం జరుగుతున్నా.. దళితుల్లో అధిక మద్దతున్న చర్మకారేతర(చమార్ లేదా జాటవ్) నేతను రాష్ట్రపతిని చేయడం ద్వారా వారి మద్దతును కూడగట్టడమే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.