ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ రిజైన్: సచిన్ టెండుల్కర్ లింక్ను కొట్టేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రఘునాథ్ షెగావోకర్ రాజీనామా చేశారు. మరోవైపు, భారతరత్న, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఐఐటీ ఢీల్లీలో అకాడమీ కోసం ల్యాండ్ అడిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సచిన్ కొట్టి పారేశారు. అయితే, సచిన్ ల్యాండ్ అడిగారనే వార్తలు రావడం, షెగావోకర్ రాజీనామా నేపథ్యంలో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దీని పైన కేంద్ర మానవ వనరుల శాఖ స్పందించింది. ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ షెగావోకర్ రాజీనామా చేసిన అంశంలో క్రికెటర్ సచిన్ టెండుల్కర్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. షెగావోకర్ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారన్నారు.
క్రికెట్ అకాడమీకి స్థలం ఇవ్వాలంటూ ఒత్తిడి రావడం వల్లే షెకావోకర్ రాజీనామా చేశారని, అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి బకాయిలకు సంబంధించి కూడా రఘునాథ్ షెగావోకర్ పైన హెచ్చార్డీ వర్గాలు ఒత్తిడి చేశాయని విమర్శలు వచ్చాయి. వీటిని హెచ్చార్డీ ఖండించింది.
కాగా, భారత క్రికెట్ మాజీ సారథి, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తన పైన వచ్చిన మీడియా ఆరోపణలను ఆదివారం నాడు కొట్టి పారేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీలో అకాడమీ ఓపెన్ చేసేందుకు సచిన్ కొంత భూమి అడిగినట్లుగా వార్తలు వచ్చాయి. దీని పైన సచిన్ స్పందించారు.
తాను ఐఐటీలో అకాడమీ ఓపెన్ చేసేందుకు ల్యాండ్ అడిగినట్లుగా వచ్చిన వార్తలను కొట్టి పారేశారు. సచిన్ టెండుల్కర్ రాజ్యసభ సభ్యుడు. తన పైన జరిగిన ప్రచారం పైన ఆయన సామాజిక అనుసంధాన వెబ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.
తన పైన వచ్చిన కథనం తనను ఆందోళనకు గురి చేసిందని పేర్కొన్నారు. అది వాస్తవ దూర కథనం అని చెప్పారు. తాను ఎలాంటి అకాడమీని ప్రారంభించాలనుకోలేదని, అందుకు ఐఐటీ ఢిల్లీని కోరలేదని పేర్కొన్నారు. ఎవరైనా తన పైన కథనాలు రాసేముందు తనను అడిగి, అది సరైందో కాదో తెలుసుకోవాలని చెప్పారు.