వంద కోట్ల నగదు: అతను జయ కోసం అపోలోకు ప్రసాదం తెచ్చాడు
శేఖర్ రెడ్డి, మరో ఇద్దరు నివాసాలపై ఐటి అధికారులు దాడులు చేసి, వంద కోట్ల రూపాయలను, 127 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శేఖర్ రెడ్డి జయ కోసం అపోలోకు తిరుమల నుంచి ప్రసాదం కూడా తెచ్చారు.
చెన్నై: ఆదాయం పన్ను శాఖ అధికారులు గత 24 గంటల పాటు జరిపిన సోదాల్లో 106 కోట్ల రూపాయలను, 127 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని ముగ్గురు వ్యాపారుల నివాసాల్లో వారు సోదాలు నిర్వహించారు. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
వాటిలో పది కోట్ల రూపాయలు కొత్త నోట్లు కాగా, మిగతా నగదు అంతా రద్దు చేసిన రూ.500, 1000 నోట్లు కావడం విశేషం. దాదాపు వంద మంది అధికారులు చెన్నై, వెల్లూరులోని ఎనిమిది ప్రాంతాల్లో గురువారంనాడు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం అందడంతో వారు ఈ సోదాలకు ఉపక్రమించారు.
ప్రముఖ వ్యాపారవేత్తులు శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వారి కంపెనీల ప్రతినిధి ప్రేమ్ నివాసాల్లో ఐటి అేధికారులు సోదాలు చేశారు. శేఖర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి సభ్యుడు కావడం విశేషం. జయలలిత కోసం ఆయన గత నెలలో ప్రసాదం తీసుకుని అపోలో ఆస్పత్రికి వచ్చాడు. జయలలిత అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఆయన వచ్చారు.
నిరుడు పన్నీరు సెల్వం శేఖర్ రెడ్డితో కలిసి తిరుమల దేవస్థానం వద్ద ఫొటోలు కూడా దిగారు. పన్నీరు సెల్వం వెంట శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం సమయంలో ఆయనే ఉన్నారు. అయితే, అప్పుడు మంత్రిగా ఉన్న పన్నీరు సెల్వంను బోర్డు సభ్యుడిగా శేఖర్ రెడ్డి ఆహ్వానించారని, అంతకు మించిన సంబంధమేమీ లేదని చెబుతున్నారు. అయితే, పన్నీరు సెల్వం శశికళకు చెప్పి జయలలిత ద్వారా ఆయనను బోర్డు సభ్యుడిగా నియమింపజేసినట్లు ప్రచారం సాగుతోంది.
శేఖర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, ప్రేమ్ నివాసాల్లో ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.1250 కోట్లు ఆస్తులను గుర్తించినట్లు చెబుతున్నారు. వెల్లూరులోని శేఖర్ రెడ్డి నివాసాన్ని ఐటి అధికారులు సీజ్ చేశారు.