కాల్చిచంపారు: బీహార్లో ఇద్దరు బీజేపీ నేతల హత్య
పాట్నా: బీహార్లో ఒకేరోజు ఇద్దరు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన సీనియర్ నేతలు హత్యకు గురయ్యారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ భోజ్పురి నేత విశ్వేశ్వర్ ఓఝాను గుర్తు తెలియని దుండుగలు కాల్పి చంపారు.
భోజ్పూర్ జిల్లాలో సోన్వర్ష-పరాసురా గ్రామాల మధ్య శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల ఘటనలో ఓఝా డ్రైవర్, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఓఝాను షాహపూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఆస్పత్రి ఇన్ఛార్జి అజయ్కుమార్ తెలిపారు.
కార్లు, మోటార్ సైకిళ్లపై 12 మంది వరకు దుండగులు ఓఝా వాహనాన్ని వెంబడించి ఆయన్ను కాల్చిచంపారని పోలీసులు తెలిపారు. హరీశ్ మిశ్రా అనే రౌడీతో ఓఝాకు దీర్ఘకాలంగా శత్రుత్వం ఉందని, అతని అనుచరులే ఈ దురాగతానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో షాహపూర్ నియోజకవర్గంలో పోటీ చేసిన ఓఝా ఓటమి చెందారు. ఓఝాకు కూడా నేర చరిత్ర ఉందని, ఓ హత్య కేసు సహా 10 వరకు క్రిమినల్ కేసులు ఆయనపై నమోదయని పోలీసులు చెప్పారు. మరోవైపు శుక్రవారం ఉదయం చాప్రా జిల్లాలో బీజేపీ మరో సీనియర్ నేత కేదార్సింగ్ హత్యకు గురయ్యారు.
వారంరోజుల క్రితం వైశాలి జిల్లాకు చెందిన ఎల్జేపీ నేత బ్రిజ్నాథ్సింగ్ దారుణహత్యకు గురయ్యారు. ఇది పది రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న రెండో రాజకీయ నేత హత్య కావడం విశేషం. ఈ రెండు హత్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళ్పాండే తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఓఝా హంతకులను 72 గంటల్లోగా అరెస్టు చేయకుంటే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని నితీశ్కుమార్ సర్కారును హెచ్చరించింది. బీహార్లో మళ్లీ జంగిల్రాజ్ వేళ్లూనుకుంటున్నదనటానికి ఈ ఘటనలు నిదర్శమన్నారు. బిహార్ సీఎం నితీశ్కుమార్ నేరాల నియంత్రణకు సమావేశాలు నిర్వహిస్తున్నా, నేరగాళ్లపై నియంత్రణ లేదనేది వాస్తవమని బీజేపీ సీనియర్ నేత సుశీల్కుమార్మోడీ విమర్శించారు.