చాప కింద నీరుల విస్తరిస్తోంది: ప్రతీ ముగ్గురు ఇండియన్స్లో ఒకరికి ఆ సమస్య!..
థైరాయిడ్ లక్షణాల గురించి వివరిస్తూ.. ఆ సమస్యతో బాధపడుతున్నవారు శారీరక బలహీనులవుతారని ఆ సంస్థ పేర్కొంది. బరువు పెరగడం, డిప్రెషన్ లోకి వెళ్లడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలతో బాధపడుతారని వైద్యులు.
న్యూఢిల్లీ: భారత్లో చాపకింద నీరులా థైరాయిడ్ విస్తరిస్తోంది. ప్రతీ ముగ్గురు భారతీయుల్లో ఒకరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారని ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ అనే సంస్థ తాజాగా వెల్లడించింది. 2014-16 మధ్య కాలంతో దేశవ్యాప్తంగా ఈ సంస్థ 33 లక్షల మంది భారతీయులపై సర్వే నిర్వహించి ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
అధిక బరువుతో పాటు, హార్మోన్ల అసమతౌల్యం వల్ల చాలామంది థైరాయిడ్ బారిన పడుతున్నట్లు తెలిపింది. అందులోను మహిళలే ఎక్కువగా థైరాయిడ్ బారిన పడుతున్నారని సంస్థ వెల్లడించడం గమనార్హం. ఇక ఉత్తర భారత్లో హైపో థైరాయిడిజం ప్రభావం ఎక్కువగా ఉందని, అటు తూర్పు రాష్ట్రాల్లో మధ్యస్తమైన సబ్ క్లినికల్ థైరాయిడిజం ఉందని ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ వెల్లడించింది.
థైరాయిడ్ లక్షణాల గురించి వివరిస్తూ.. ఆ సమస్యతో బాధపడుతున్నవారు శారీరక బలహీనులవుతారని ఆ సంస్థ పేర్కొంది. బరువు పెరగడం, డిప్రెషన్ లోకి వెళ్లడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలతో బాధపడుతారని వైద్యులు తెలిపారు. పురుషుల కంటే మహిళలు 8రెట్లు అధికంగా థైరాయిడ్ బారిన పడే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. థైరాయిడ్ పట్ల అప్రమత్తంగా ఉండి.. తొలి నుంచి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా దీన్ని అధిగమించవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.