రజినీ తప్ప వేరే విషయాలే లేవా?: నటి కస్తూరి ఆగ్రహం
చెన్నై: ప్రముఖ తమిళనటి కస్తూరి మరోసారి సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశం అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఆ విషయాలేవీ పట్టించుకోకుండా కేవలం రజినీకాంత్ రాజకీయ ఆగమనంపైనే జాతీయ మీడియా ఫోకస్ చేయడం దారుణమని మండిపడ్డారు.
రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై కస్తూరి గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా కస్తూరి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ మీడియా తీరు సరిగా లేదన్నారు.
'రజినీకాంతే కాదు.. తమిళనాడులో చర్చించుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. గత డిసెంబర్ నుంచి రాష్ట్రంలో శూన్యత ఆవరించి ఉంది. ఓ మంచి వ్యక్తి వచ్చి ఈ శూన్యాన్ని భర్తీ చేయాలి. అయితే, ఆయన రాజకీయాల్లో విస్తారా? రారా? అంటూ అస్తమానం ఊహాగానాలు చేయడం సరికాదు' అని కస్తూరి వ్యాఖ్యానించారు.
కాగా, కస్తూరి ఇటీవల రజినీకాంత్ని కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీ వల్ల ఆయన రాజకీయ అభిప్రాయాలు తెలుసుకునే వీలు కలిగిందని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేగాక, త్వరలోనే మార్పు దిశగా రజినీ అడుగులు వేసే అవకాశముందని తెలిపారు. రజినీకాంత్ మరోసారి అభిమానులతో సమావేశమై తన రాజకీయ ప్రవేశంపై ప్రకటిస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.