రామమందిరంకు ముస్లీంల మద్దతు: అజంఖాన్, మద్దతుగా హోర్డింగులు
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దతుగా ముస్లింలు బ్యానర్లు కడుతున్నారు. అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్టు సూచించిన నేపథ్యంలో తాము ఈ విధంగా మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.
లక్నో: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దతుగా ముస్లింలు బ్యానర్లు కడుతున్నారు. అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్టు సూచించిన నేపథ్యంలో తాము ఈ విధంగా మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.
బిజెపి ఎన్నికల ప్రణాళికలో రామ మందిర నిర్మాణం గురించి ఉంది. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగబద్ధంగా రామాలయాన్ని నిర్మిస్తామని పేర్కొంది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కోర్టు బయట పరిష్కారానికి మద్దతిస్తున్నట్లు శ్రీరామ్ మందిర్ నిర్మాణ్ ముస్లిం కర సేవక్ మంచ్ అధ్యక్షులు అజం ఖాన్ చెప్పారు.
అయోధ్య-బాబ్రీ వివాదం: కూల్చివేత నుంచి కూల్చివేత దాకా.. ఇదీ జరిగింది!
ఆయన లక్నోలో పది హోర్డింగులను పెట్టారు. అంతేకాకుండా ముస్లింలలో ఏకాభిప్రాయం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. భావసారూప్యతగల ముస్లింలతో ఆయన ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఆయన 'జై శ్రీరామ్' అనే నినాదాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. రాముడిని హిందువులు గౌరవించినట్లుగానే, ముస్లింలకు కూడా ఆయన గౌరవనీయుడేనని చెప్తూ ఉంటారు.
ఆజం ఖాన్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పెరుగుతోంది. ఆయనతో అనేకమంది యువత చేతులు కలుపుతున్నారు. వివాదాన్ని తిరగదోడుతూ ఇరుమతాల పెద్దలు ప్రజల మధ్య ద్వేషభావం పెంచుతున్నారని వీరు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం ఆజం ఖాన్కు ఇద్దరు సాయుధ గార్డులు రక్షణగా ఉన్నారు. తనకు ఫోన్లు, ఈ-మెయిళ్ళ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని, తనకు భద్రతను పెంచాలని కోరారు. బాబ్రీ మసీదు పునర్నిర్మాణానికి అనుకూలంగా మాట్లాడాలని హెచ్చరికలు వస్తున్నాయన్నారు.
తాను చేస్తున్న ప్రయత్నాలను ఆపేందుకు డబ్బులు ఇస్తామని కూడా కొందరు చెప్తున్నారన్నారు. ఇరు మతాలకు పెద్దలమని తమకు తాము చెప్పుకుంటున్నవారు వైదొలగితే అయోధ్య వివాదం చిటికెలో పరిష్కారమవుతుందన్నారు. సామాన్యులకు రామ మందిర నిర్మాణం వల్ల సమస్య ఏం లేదన్నారు.