కేంద్రం మరో షాక్: ఇక బినామీ ఖాతాలు, లాకర్లపై ఐటీ దాడులే!
నల్లధనాన్ని ఏ రూపంలో ఉన్న నిర్మూలించేందుకు కేంద్ర మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: నల్లధనాన్ని ఏ రూపంలో ఉన్న నిర్మూలించేందుకు కేంద్ర మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకు లాకర్లలో నల్లధనం, నగలను దాచిన నల్ల కుబేరులపై చర్యకు కేంద్రం మరో ముందడుగు వేసింది. చాలామంది నల్ల కుబేరులు బినామీ పేర్లతో బ్యాంకుల్లో లాకర్లు తీసుకొని అక్రమంగా నల్లధనాన్ని పెద్ద ఎత్తున దాచి ఉంచారనే సమాచారంతో కేంద్రం ఆదాయపుపన్నుశాఖ అధికారులను రంగంలో దింపి దాడులకు శ్రీకారం చుట్టింది.
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎక్కువ సార్లు లాకర్లు తెరిచిన వారి వివరాలను ఐటీ అధికారులు బ్యాంకుల నుంచి సమాచారం సేకరించారు. అనుమానాస్పద లాకర్లను ఎవరు నిర్వహిస్తున్నారు?, ఈ లాకర్లు ఎవరివి అనే విషయంపై ఆరా తీస్తున్నామని కేంద్రం ప్రకటించింది.
ఇటీవల జరిపిన దాడుల్లో 600 కోట్ల రూపాయల నగదుతోపాటు బంగారం పెద్ద ఎత్తున లభ్యమైన విషయం తెలిసిందే. పన్ను చెల్లించని రూ.5,343 కోట్ల ఆస్తులు వెలుగుచూసిన నేపథ్యంలో ఐటీ శాఖ బినామీ లాకర్లపై నిఘా వేసింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం నవంబరు 10వతేదీ తర్వాత బ్యాంకుల్లో ఆరంభించిన కొత్త ఖాతాల సమాచారాన్ని ఐటీ శాఖ సేకరించింది.
అనుమానాస్పదంగా లావాదేవీలు నిర్వహించిన ఆరువేలమందికి ఐటీ శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు వెయ్యిమందిపై దాడులు నిర్వహించి నల్లధనం ఉన్న 279 మందిపై కేసులు నమోదు చేశామని ఐటీ శాఖాధికారులు తెలిపారు. కాగా, కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో నల్లకుబేరులు మరోసారి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.