శుభవార్త: ప్రసూతి సెలవును 8 నెలలకు పెంచే యోచన
న్యూఢిల్లీ: గర్భిణులైన మహిళా ఉద్యోగులకు ఇచ్చే ప్రసూతి సెలవును 8 నెలలకు పెంచాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి నూతర్ గుహ బిశ్వాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం గర్భిణులైన ఉద్యోగులకు ప్రస్తుతం మూడు నెలలు ప్రసూతి సెలవు ఇస్తున్నారు.
దీనిని 8 నెలలకు పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ దిశగా ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1961ను సవరించేందుకు కార్మిక శాఖ చర్యలు తీసుకుంటోందని ఓ అధికారి తెలిపారు. కాన్పు అంచనా తేదికి ముందు నెల, కాన్పు తర్వాత ఏడు నెలల పాటు మహిళా ఉద్యోగులకు సెలవు మంజూరు చేయాలని ఆ శాఖ ప్రతిపాదించింది.
దీనిపై పీఎంఓ సూచనాప్రాయంగా ఆమోదం తెలపడంతో ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా కార్మిక శాఖ ఇప్పటిదాకా ఉన్న చట్టానికి సవరణలు చేసేందుకు రంగంలోకి దిగింది. ‘‘ప్రసూతి సెలవు పెంపు ప్రతిపాదనను కేబినెట్ సెక్రటేరియట్ కు పంపాం. ప్రధాని నరేంద్ర దృష్టికీ తీసుకెళ్లాం. ఆయన ఎంతో సానుకూలత చూపారు. అందుకే ఆయనకూ ఈ ప్రతిపాదన ప్రతిని పంపుతున్నాం'' అని బిశ్వాస్ చెప్పారు.
కేంద్రం నుంచి దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ అయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకనుగుణంగా ఈ సెలవును 8 నెలలకు పెంచుతారు.