డ్రాగన్కు ఇక చుక్కలే: ఓబీఓఆర్పై జపాన్, భారత్ ఉమ్మడి వ్యూహం
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలను ప్రభావితం చేసే కొన్ని లక్షల కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టుతో అంతర్జాతీయ సమాజానికి బహుమతి ఇవ్వాలని చైనా తీసుకున్న నిర్ణయాన్ని అంచనా వేయడం విశ్లేషకులకు సాధ్యం కావడం లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలను ప్రభావితం చేసే కొన్ని లక్షల కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టుతో అంతర్జాతీయ సమాజానికి బహుమతి ఇవ్వాలని చైనా తీసుకున్న నిర్ణయాన్ని అంచనా వేయడం విశ్లేషకులకు సాధ్యం కావడం లేదు. యావత్ ప్రపంచ దేశాలకు అత్యంత పెద్ద బహుమతి ఇస్తూ చైనా నిర్వహించిన బెల్ట్ రోడ్ ఇన్సియేటివ్ (బీఆర్ఐ) సదస్సుకు బహిరంగంగా గైర్హాజరైన దేశం భారత్ ఒక్కటే కావడం గమనార్హం.
కానీ శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజనీతి అస్త్రాన్ని ప్రయోగించిందీ భారత్. ఒకే బెల్ట్ ఒకే రోడ్డు (ఓబీఓఆర్) ప్రాజెక్టును డ్రాగన్ నిలువరించేందుకు దాని బద్ధ శత్రువైన జపాన్తో చేతులు కలిపింది. వివిధ ఖండాల మీదుగా చైనా నిర్మాణం చేపట్టిన అతిపెద్ద మౌలిక వసతుల ప్రాజెక్ట్.. సిల్క్ రోడ్డు పట్ల భారతదేశం ఒక్కటే వ్యతిరేకంగా నిలిచింది.
రెండు సార్లు చైనా వీటో పవర్ ఇలా
కానీ బెల్ట్ రోడ్ ఇన్సియేటివ్ (బీఆర్ఐ)ను వ్యతిరేకించడానికి భారత్కు కొన్ని ప్రత్యేక కారణాలే ఉన్నాయి. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జి) సభ్యత్వం పొందేందుకు భారత్ చేసిన ప్రయత్నాలను చైనా అడ్డుకున్నది. పాకిస్థాన్ దేశంలోని అజర్ మసూద్పై అంతర్జాతీయ ఉగ్రవాది అన్న ముద్ర వేసేందుకు ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రయత్నాన్ని చైనా తనకు గల వీటో అధికారంతో రెండుసార్లు అడ్డుకున్నది. న్యూఢిల్లీ ఈ ప్రాజెక్టును నిలువరించడానికి భారతదేశం, చైనా దేశాల మధ్య గల భిన్నమైన రాజకీయ నేపథ్యం కూడా కారణం కావచ్చు.
అర్థవంతమైన చర్చేమిటని చైనా ఎదురు సవాల్
బీఆర్ఐ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టులో భాగంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) మీదుగా చైనా - పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) నిర్మాణం చేపట్టడాన్ని భారతదేశం ప్రశ్నిస్తోంది. తమ ప్రాదేశిక సమగ్రతకు భంగం వాటిల్లుతుందని వాదిస్తున్నది. బీఆర్ఐ నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపైనా, ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేందుకు సంప్రదింపులు జరుపాలన్న భారత్ అభ్యర్థనను చైనా తోసిపుచ్చుతున్నది. ఓబీఓఆర్పై అర్థవంతమైన చర్చ జరిపితే బాగుంటుందని భారత్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే చేసిన వ్యాఖ్యలపై బీజింగ్ ప్రతిస్పందించింది. కానీ అర్థవంతమైన చర్చలంటే ఏమిటో భారతదేశం తెలుపాలని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ కోరారు.
చైనా ప్లాన్పై భారత్, జపాన్ వ్యతిరేకం
లక్షల కోట్ల డాలర్ల వ్యయంతో వివిధ దేశాల భాగస్వామ్యంతో బీజింగ్ నుంచి టర్కీ వరకు సిల్క్ రూట్లో వాణిజ్య రహదారిని, అలాగే పుజోహు నుంచి గ్రీస్ దేశంలోని ఏథేన్స్ మీదుగా ఆఫ్రికా ఖండంలోని నైరోబీ మీదుగా ఇటలీలోని వెనిస్ వరకూ నూతన సిల్క్ రూట్ సముద్ర మార్గాన్ని చైనా నిర్మిస్తోంది. ఈ రెండింటిని కలిపే వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) అని సంక్షిప్తంగా పిలుస్తున్నారు. యూరప్, ఆఫ్రికా ఖండాలను అనుసంధానించే ఈ ప్రాజెక్టును భారత్, జపాన్ సహా పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. చైనా బయటకు వాణిజ్యపరమైన సంబంధాల కోసమేనని చెబుతున్నా.. రక్షణ రంగ అవసరాలకు వినియోగించుకోవడమే బీజింగ్ రహస్యంగా దాచిపెట్టుకున్న దురుద్దేశమనేది భారత్ అభ్యంతరం.
ఇలా భారత్, జపాన్ ఉమ్మడి వ్యూహం
తూర్పు ఆఫ్రికా, ఇరాన్, శ్రీలంక, దక్షిణాసియా దేశాల్లో సిల్క్ రోడ్ మార్గంలో ఉమ్మడి ప్రాజెక్టులను చేపట్టాలని భారత్, జపాన్ భావిస్తున్నాయి. ఇందుకోసం ఆసియా - పసిఫిక్ నుంచి ఆఫ్రికా వరకు ఫ్రీడం కారిడార్ను డెవలప్ చేయనున్నాయి. గత నవంబర్ నెలలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. జపాన్లో పర్యటించినప్పుడు ఆ దేశ ప్రధాని షింజే అబే ఈ కారిడార్ నిర్మాణం సంగతి ప్రస్తావించారు. ఆయా దేశాల్లో మౌలిక వసతుల కల్పన, నౌకాశ్రయాల అభివ్రుద్ధి, సామర్థ్య విస్తరణ జపాన్, భారత్ ఉమ్మడి భాగస్వామ్యంలోని ప్రాజెక్టు లక్ష్యాలని చెప్తున్నాయి. ఆచరణలో చైనా దూకుడును నిలువరించడమే భారత్, జపాన్ దేశాల ప్రధాన ఉద్దేశం.
ఉమ్మడి ప్రాజెక్టుపై 24న భారత్, జపాన్ చర్చలు
ఇరాన్లోని చాబహర్, తూర్పు శ్రీలంకలోని ట్రింకోమలి, థాయ్ - మయన్మార్ సరిహద్దులోని దావీ ఓడరేవుల అభివ్రుద్ధి భారత్ - జపాన్ ఉమ్మడి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం. ఈ ఉమ్మడి ప్రాజెక్టు విషయమై ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్లో ఆఫ్రికా అభివ్రుద్ధి బ్యాంకుతో జపాన్, భారత్ చర్చలు జరుపనున్నాయి.
చైనాకు ఎదురు దెబ్బ ఇలా
ఓబీఓఆర్ ఫోరం సదస్సుకు హాజరైన యూరోపియన్ యూనియన్ (ఇయు) సభ్యదేశాలు చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడానికి నిరాకరించాయి. ఇది చైనా దౌత్యపరమైన దూకుడుకు గట్టి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు, నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే ఏది ఏమైనా చైనా చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం హెచ్చరికలతో ప్రారంభమైంది. శ్రీలంక మాదిరే భారీ రుణాలు తీసుకుని చేపట్టిన నౌకాశ్రయాలు, జాతీయ రహదారుల నిర్మాణం అధిక వడ్డీరేట్లతో భారీ రుణాలు మిగులుస్తాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొనే శ్రీలంక తదితర దేశాల్లోని రాజకీయ నేతల అవినీతి లీలలు ఇబ్బందికరంగా మారనున్నాయి.