ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్: విద్యుత్ సదుపాయ కల్పనలో దూసుకెళ్తున్న భారత్
విద్యుత్ సదుపాయం కల్పించడంలో భారతదేశం వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. విద్యుత్ సదుపాయాలకు సంబంధించి ఈ ఏడాదికి గాను ప్రపంచ బ్యాంక్ రూపొందించిన జాబితాలో భారత్ 26వ స్థానానికి ఎగబాకిందని కేంద్ర విద్యుత్
లండన్: విద్యుత్ సదుపాయం కల్పించడంలో భారతదేశం వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. విద్యుత్ సదుపాయాలకు సంబంధించి ఈ ఏడాదికి గాను ప్రపంచ బ్యాంక్ రూపొందించిన జాబితాలో భారత్ 26వ స్థానానికి ఎగబాకిందని కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
2014లో మన దేశం 99వ స్థానంలో ఉందని.. అంటే మూడేళ్లలో ర్యాంకింగ్ 73 స్థానాలు ఎగబాకిందన్నారు. దేశంలో ప్రతి ఇంటికి కరెంట్ అందజేయాలని, విద్యుత్ సదుపాయాలను సులభతరం చేయాలని, అందరికీ అందుబాటులోకి తేవాలన్న ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం దిశగా వడివడిగా ముందుకెళ్లగలుగుతున్నందుకు సంతృప్తికరంగా ఉందని గోయల్ వివరించారు.
అంతేగాక, 2019కల్లా దేశంలోని ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా చేయగలుగుతామని పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ అందరికీ సులువుగా అందుబాటులో తెచ్చేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మరింత సన్నిహితంగా పనిచేస్తోందన్నారు.
మారుమూల ప్రాంతాలకు సైతం విద్యుత్ సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం శరవేగంగా పనులు చేపడుతున్నదని గతవారంలో జరిగిన వియన్నా ఎనర్జీ ఫోరంలో మంత్రి పేర్కొన్నారు. వెయ్యి రోజుల్లో 18,452 మారుమూల గ్రామాల విద్యుదీకరణ లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 13వేల గ్రామాలకు సరఫరా మొదలైందన్నారు. మిగితాది కూడా అనుకున్న సమయంలో పూర్తి చేస్తామన్నారు.