భారత్-సింగపూర్ 'నేవీ డ్రిల్'పై అభ్యంతరం లేదు, కానీ!..: చైనా
దేశాల మధ్య సత్సంబంధాలను పెంపొందిచుకోవడానికి, పరస్పర సహకారం అందించుకోవడానికే ఈ విన్యాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తాము భావిస్తున్నామన్నారు.
బీజింగ్: ఇండియా-సింగపూర్ కలిసి దక్షిణ చైనా సముద్రంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న నౌకాదళ విన్యాసాల పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చైనా స్పష్టం చేసింది. అయితే తమ దేశ ప్రయోజనాలకు, శాంతియుత వాతావరణానికి ఇది భంగం కలిగించరాదని చైనా పేర్కొంది.
గురువారం నాడు ఇండియా సింగపూర్ సంయుక్త విన్యాసాలు దక్షిణ చైనా సముద్రంలో ప్రారంభమైన నేపథ్యంలో.. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్ యింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాల మధ్య సత్సంబంధాలను పెంపొందిచుకోవడానికి, పరస్పర సహకారం అందించుకోవడానికే ఈ విన్యాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తాము భావిస్తున్నామన్నారు.
కాగా, దక్షిణ చైనా సముద్రంపై తమకే పూర్తి హక్కులు ఉన్నాయని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫిలిప్పీన్స్, వియత్నాం, బ్రూనై, మలేషియా, ఇండోనేషియా, తైవాన్ లు తమ వాటా కోసం పోరాడుతున్నాయి. అయితే ఈ వివాదంతో భారత్, సింగపూర్ లకు సంబంధం లేకపోయినప్పటికీ.. ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలపై తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.