మావాళ్లు అంగీకరించరు: భారతీయ ముస్లీంలపై రాజ్నాథ్ ప్రశంసలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రత్యేకంగా ఏ మతంతోను ముడిపెట్టకూడదని, భారతీయ ముస్లీంలు జాతీయవాదులు అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం అన్నారు. ఎల్లప్పుడూ ఉగ్రవాద శక్తులను వ్యతిరేకించే భారతీయ ముస్లీంలు అంతా జాతీయవాదులే అన్నారు.
ఆయన ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మతఛాందసవాద ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) లాంటి సంస్థల ప్రభావానికి లోబడేందుకు భారతీయ ముస్లీంలు అంగీకరించరని చెప్పారు. అలాంటి శక్తులను వ్యతిరేకిస్తారన్నారు. ఉగ్రవాదం పైన పోరులో పాకిస్తాన్ పూర్తిగా సహకరించాలన్నారు.
అంతకుముందు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... నకిలీ భారతీయ కరెన్సీ రాకెట్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కోసం దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతోందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాని నకిలీ కరెన్సీని ఉపయోగించుకుంటున్నందున అది ఒక పెద్ద సమస్యగా మారిందన్నారు.
ఉగ్రవాదంతో పోరాటానికి భారత్ అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. బ్యాంకులను దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణించారు. అవి దేశానికి జీవనాడి కావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. బ్యాంకులను జాతీయం చేయడం స్వాతంత్య్రానంతరం ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి తీసుకున్న అతిపెద్ద నిర్ణయంగా అభివర్ణించారు.
అయితే జాతీయకరణ తర్వాత కూడా బ్యాంకులు ప్రజలకు చేరువ కాలేదన్నారు. జన్ ధన్ యోజన కింద 15 కోట్ల కుటుంబాలకు చేరువ అయినందుకు బ్యాంకింగ్ రంగాన్ని అభినందిస్తున్నాయన్నారు. ఇది చిన్న విషయం కాదన్నారు.