ట్రంప్ ఎఫెక్ట్: భారత సంతతి మహిళను అమెరికాలో అడుగుపెట్టనీయలేదు!
భారత సంతతికి చెందిన కెనడియన్ మహిళను అమెరికాలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్నారు అధికారులు. ఆమె సరిహద్దును దాటి అమెరికాలో అడుగుపెట్టాలంటే ఇమ్మిగ్రెంట్ వీసా కావాలంటూ అమెరికా అధికారులు అడ్డు చెప్పారు.
టొరంటో: అమెరికాలో భారతీయులు, భారత సంతతి వ్యక్తులపై దాడులు, అవమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, భారత సంతతికి చెందిన కెనడియన్ మహిళను అమెరికాలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్నారు అధికారులు. ఆమె సరిహద్దును దాటి అమెరికాలో అడుగుపెట్టాలంటే ఇమ్మిగ్రెంట్ వీసా కావాలంటూ అమెరికా అధికారులు అడ్డు చెప్పారు.
ది హఫింగ్టన్ పోస్ట్(కెనడా) కథనం ప్రకారం.. మన్ప్రీత్ కూనర్(30) అనే భారత సంతతి మహిళ కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఉంటోంది. ఇటీవల తాను అమెరికా వెళ్లాల్సి వచ్చి క్యూబెక్-వెర్మాంట్ సరిహద్దు వద్ద గల ప్రత్యేక తనిఖీ విభాగానికి చేరుకుంది. కాగా, ఆమెను ఆరు గంటలపాటు ఎదురుచూసేలా చేశారు అక్కడి అధికారులు.
వేలిముద్రలు, ఫొటోలు తీయడం, ప్రశ్నించడంలాంటివి పూర్తి చేశారు. ఇదంతా ముగిసిన తర్వాత ఆమెను అమెరికాలోకి అనుమతిస్తారనుకుంటే.. చివరి నిమిషంలో ఇమ్మిగ్రేషన్ వీసా ఉందా అని ప్రశ్నించి.. లేదు అనడంతో ఆమెను అమెరికాలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్నారు. కాగా, ఈ తతంగాన్నంతా సదరు భారత సంతతి మహిళ తన ఫేస్ బుక్ లో
'నేను ఇది నమ్మలేకపోతున్నా. అమెరికాలోకి అడుగుపెట్టకుండా నన్ను తిరస్కరించారు. అమెరికాలోకి అడుగుపెట్టేందుకు నాకు వీసా ఉన్నప్పటికీ ఇమ్మిగ్రెంట్ వీసా కావాలంటూ అడ్డుకున్నారు. అది లేకుంటే నేను అమెరికాలో అడుగుపెట్టలేనని తేల్చి చెప్పారు. నేను వారికి ఒక వలసదారినిగా కనిపించాను' అని ఆ మన్ప్రీత్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానంలో పెనుమార్పులు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా అధికారులు వలసదారులపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.