ఫేస్బుక్లో మోడీపై వ్యంగ్యచిత్రం: భారత ఉపాధ్యాయురాలి తొలగింపు
దోహా: భారత ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్య చిత్రాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసిందన్న ఆరోపణలతో ఖతర్ రాజధాని దోహాలో ఓ ఉపాధ్యాయురాలిపై వేటు పడింది. ఇక్కడి భారతీయులకు చెందిన ఎంఈఎస్ స్కూల్లో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు వారంక్రితం తన ఫేస్బుక్ అకౌంట్లో మోడీకి సంబంధించి కార్టూన్ను పోస్ట్ చేసింది.
ఆమె తన ఫేస్బుక్లో స్కూల్ లోగోను కూడా ఉపయోగించారని, దీంతో పాఠశాల ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన యాజమాన్యం.. తొలుత మూడురోజులపాటు విచారణ నిమిత్తం ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది.
గురువారం ఆమెను పూర్తిగా విధుల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది. సదరు టీచర్ పేరును స్కూల్ యాజమాన్యం బయటపెట్టలేదు. ‘నేను ఎలాంటి తప్పూ చేయలేదు. ఎలాంటి కార్టూన్ను పోస్ట్ చేయలేదు. ఎవరినుంచో ఆ చిత్రం వస్తే దాన్ని షేర్ చేశానంతే.. మోడీని అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు' అని టీచర్ స్థానిక మీడియాకు తెలిపింది.
కాగా, ఆమె కార్టూన్ను పోస్టు చేసిన తర్వాత ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు భారతీయులు విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. దోహాలోని భారత ఎంబసీకి కూడా ఆమె పోస్టుపై ఫిర్యాదులు అందాయి. సదరు పాఠశాలకు తమకందిన ఫిర్యాదులను పంపించామని, అది ప్రైవేటు పాఠశాల కావడంతో తాము జోక్యం కోలేమని భారత ఎంబసీ అధికారి ఒకరు తెలిపారు. సదరు టీచర్ను తొలగించినట్లు తెలిసిందని ఆయన చెప్పారు.