అనారోగ్యం: విమానం అత్యవసర ల్యాండింగ్
ఇండోర్: ముంబై నుండి లక్నో వెలుతున్న విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయిన సంఘటన ఇండోర్ లో జరిగింది. ప్రయాణికురాలు అనారోగ్యం పాలైందని, అందుకే విమానం దించివేశామని అధికారులు తెలిపారు.
సోమవారం ముంబై నుండి లక్నోకు ఇండిగో విమానం బయలుదేరింది. ఆ విమానంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన సరోజ్ సింగ్ (54) అనే మహిళ ప్రయాణించారు. అయితే మార్గం మద్యలో ఆమె శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందికి గురైనారు.
వెంటనే ఆమె విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విమాన సిబ్బంది ఇండోర్ విమానాశ్రయం అధికారులకు విషయం చెప్పారు. ఎయిర్ పోర్టు అధికారులు అనుమతి ఇవ్వడంతో ఇండోర్ లోని దేవి అహల్యాబాయి హోల్కర్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
తరువాత సరోజ్ సింగ్ ను ఇండోర్ లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఇండిగో విమానం లక్నో బయలుదేరి వెళ్లింది. సరోజ్ సింగ్ కొలుకుంటున్నారని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.