ఇందిరా క్యాంటీన్ లో అన్నం, సాంబర్ తిన్న రాహుల్ గాంధీ, జయలలితను ఫాలో అయ్యారు !
పేద ప్రజల కోసం అతి తక్కువ ధరకు ఆహారం అందించడానికి ఇందిరా క్యాంటీన్లను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించారు.
బెంగళూరు: పేద ప్రజల కోసం అతి తక్కువ ధరకు ఆహారం అందించడానికి ఇందిరా క్యాంటీన్లను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించారు. బెంగళూరులోని జయనగరలోని కనకనపాళ్యలో బుధవారం ఇందిరా క్యాంటీన్ ను రాహుల్ గాంధీ ప్రారంభించారు.
ఇదే సమయంలో బెంగళూరు నగరంలోని 101 వార్డుల్లో ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించారు. ఇందిరా క్యాంటీన్ ప్రారంభించిన సందర్బంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలు అతి తక్కువ ధరకు ఇక్కడ అల్పాహారం, భోజనం తినడానికి చక్కటి అవకాశం ఉందని అన్నారు.
ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించిన సిద్దరామయ్య ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ అభినందించారు. ఈ సందర్బంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ బెంగళూరు నగరంలో 101 ఇందిరా క్యాంటీన్లు బుధవారం నుంచి పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
బెంగళూరులోని అన్ని వార్డుల్లో ఇందిరా క్యాంటీన్లు ప్రారంభిస్తామని, సరైన స్థలం చిక్కకపోవడంతో 97 ఇందిరా క్యాంటీన్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని సిద్దరామయ్య వివరించారు. ఇందిరా క్యాంటీన్ ప్రారంభించిన తరువాత అక్కడ రాహుల్ గాంధీ అన్నం, సాంబార్, వాంగీబాత్ తిన్నారు.
ఈ కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్, కర్ణాటక పట్టణాభివృద్ది శాఖా మంత్రి కేజే. జార్జ్, మంత్రులు పాల్గోన్నారు. తమిళనాడులో పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే తరహాలో బెంగళూరులో పేద ప్రజల కోసం ఇందిరా క్యాంటిన్లు ప్రారంభించారు.