జైలుకు ఇంద్రాణి: ఆత్మహత్యాయత్నం నాటకమేనా?
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బారా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీయాను ముంబైలోని జేజే ఆసుపత్రి నుంచి మంగళవారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి డీన్ లహనె తెలిపారు.
కన్న కూతురు షీనా బారాను హత్య చేసిందనే ఆరోపణలపై అరెస్టయి జైలులో ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ముంబైలోని జేజే ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే ఆమె ఆత్మహత్యకు పాల్పడలేదని మహారాష్ట్ర ప్రభుత్వంకు అందిన నివేదిక పేర్కొంది. ఈమేరకు జేజే ఆస్పత్రి వైద్యాధికారులను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. షీనా బోరా హత్య కేసును మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ నిమిత్తం సిబిఐకి అప్పగించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఇంద్రాణి సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు నాటకమాడినట్టు భావిస్తున్నారు. కాగా, పోలీసుల విచారణలో ఇంద్రాణి కూడా తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడలేదని చెప్పడం గమనార్హం. దీంతో ఆమెపై ఎవరైనా విష ప్రయోగం చేశారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.
ఇది ఇలా ఉండగా, త్వరలోనే పోలీసుల ప్రశ్నలకు ఇంద్రాణి సమాధానం చెబుతారని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ఇకపై ఇంద్రాణి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
షీనా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురవ్వడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా, ఇంద్రాణిని విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.