నారాయణమూర్తికి అనారోగ్యం: వాయిదా పడ్డ ఇన్ఫీ ఇన్వెస్టర్ల సమావేశం..
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో సంస్థ ఇన్వెస్టర్లతో నేటి సాయంత్రం తలపెట్టిన కీలక సమావేశం వాయిదా పడింది.
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో సంస్థ ఇన్వెస్టర్లతో నేటి సాయంత్రం తలపెట్టిన కీలక సమావేశం వాయిదా పడింది. నేటి సమావేశంలో ఇన్వెస్టర్లను ఉద్దేశించి మూర్తి ప్రసంగించాల్సి ఉంది.
ఇన్ఫీ బైబ్యాక్ కు.. విశాల్ సిక్కా ఎఫెక్ట్? రేపటి బోర్డు సమావేశమే కీలకం!
అనారోగ్య కారణాలతో సమావేశం రద్దయిపోవడంతో ఈ నెల 29వ తేదీకి దీన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. సంస్థ సీఈవోగా విశాల్ సిక్కా అనూహ్య రాజీనామా తర్వాత కంపెనీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
సంస్థలో భారీ వేతనాలను ఆఫర్ చేయడం, భవిష్యత్తు వ్యూహాలను సరిగా అమలు చేయకపోవడం నారాయణమూర్తికి తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ ఎఫెక్ట్ విశాల్ సిక్కా రాజీనామా దాకా దారితీసింది. తన మీద చేస్తున్న నిరాధార ఆరోపణల వల్లే తాను తప్పుకుంటున్నట్లుగా సిక్కా ప్రకటించిన సంగతి తెలిసిందే.
సిక్కా రాజీనామా తర్వాత ఇన్ఫీ షేర్లు కుప్పకూలడంతో బై బ్యాక్ ఆఫర్ ప్రకటించారు. అయినప్పటికీ ఈక్విటీ పుంజుకోకపోవడంతో.. సంస్థ తలపట్టుకుంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే సంస్థ ఇన్వెస్టర్లతో ఆయన సమావేశానికి ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా అనారోగ్యం వెంటాడటంతో ఇక్కడ కూడా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి.
ఇదిలా ఉంటే. వచ్చే సంవత్సరం మార్చిలోగా కొత్త సీఈఓ ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్న ఇన్ఫోసిస్, యూబీ ప్రవీణ్ రావును తాత్కాలిక సీఈఓగా ప్రకటించిన విషయం తెలిసిందే.