తప్పలేదు: యూఎస్కు 1మిలియన్ డాలర్లు చెల్లించనున్న ఇన్ఫోసిస్
బెంగళూరు/న్యూయార్క్: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం భారీగా జరిమానా విధించింది. అమెరికా వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 1 మిలియన్ డాలర్ల మేర జరిమానా విధించినట్టు న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎరిక్ టి స్కేడర్మేన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
నిబంధనల అతిక్రమణ
ఇన్ఫోసిస్ సంస్థ ఔట్సోర్సింగ్ సర్వీసుల్ని నిర్వర్తించడంలో భాగంగా తమ దేశ వీసా నిబంధనల్ని అతిక్రమిస్తోందంటూ అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఎరిక్ తెలిపారు.
ఇది హెచ్చరికే..
ఇన్ఫోసిస్ సంస్థ అమెరికాలో అనేక వేతన పరిమితులు ఉండటంతో భారత్ నుంచి తన ఉద్యోగుల్ని బిజినెస్ వీసాలతో న్యూయార్క్కు తీసుకొచ్చిందని చెప్పారు. తమ రాష్ట్ర పౌరుల ఉద్యోగాలకు కోత పడే విధంగా ఇతర కంపెనీలు తమ న్యాయ నిబంధనల్ని అతిక్రమిస్తే అనుమతించేది లేదని ఎరిక్ హెచ్చరించారు.
బీ-1 వీసాలు సులభం
కాగా, 2011 నుంచి ఈ వీసా వివాదం కొనసాగుతోంది. ఔట్సోర్సింగ్ సర్వీసుల కోసం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను హెచ్-1బీ వీసాలకు బదులుగా బిజినెస్ వీసాలు బీ-1 కింద తీసుకొచ్చినట్లు అప్పట్లో ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. బీ-1 తాత్కాలిక పర్యాటక వీసా. అంతేగాక, హెచ్-1బీ కంటే ఈ వీసాలను పొందడం చాలా సులభం. దీనికి 65వేల వీసాల పరిమితి కూడా ఉండదు.
ఇన్ఫోసిస్ అంగీకరించడంతో
ఈ క్రమంలో ఉద్యోగులను ఇలా సులువుగా తీసుకొచ్చి తమ నిబంధనలను ఇన్ఫోసిస్ అతిక్రమించిందని కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టడంతో.. 2013లో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్తో ఇన్ఫోసిస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు ఇన్ఫోసిస్ 1మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించిందని న్యూయార్క్ ప్రభుత్వం తెలిపింది. దీంతో రెండు పార్టీలు దీర్ఘకాలిక వ్యాజ్యాలను రద్దు చేసుకున్నారు. ఇన్ఫీ నిర్ణయంతో కేసును కూడా మూసివేయనున్నట్లు వెల్లడించింది. నిబంధనలను అతిక్రమించిం నడుచుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్కు పడిన ఇలాంటి భారీ జరిమానాల నుంచి తప్పించుకోవాలంటే ఇతర భారత ఐటీ సంస్థలు కూడా యూఎస్ వీసా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే.