షాక్: ఇన్ఫోసిస్ కార్యాలయంలో లేడీ టెక్కీ దారుణ హత్య
ప్రముఖ ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ సంస్థ లేడీ టెక్కీ కేరళకు చెందిన ఆనంద్ కె. రసిలా రాజు (25) తను పని చేస్తున్న పూణే రాజీవ్ మహాత్మగాంధీ ఇన్ఫోటెక్ పార్క్ కార్యాలయంలో బెంగళూరుకు చెందిన తన టీమ్.
పూణే: ప్రముఖ ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ సంస్థ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తను పని చేస్తున్న కార్యాలయంలోనే దారుణ హత్యకు గురైంది. పూణే రాజీవ్ మహాత్మగాంధీ ఇన్ఫోటెక్ పార్క్ కార్యాలయం ఉద్యోగి అనంద్ కె. రాసిలా రాజు (25) అనే యువతి హత్యకు గురైయ్యింది.
ఈ కేసులో సెక్యూరిటీ గార్డును ప్రధాన అనుమానితుడిగా గుర్తించి సోమవారం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పూణే అసిస్టెంట్ కమిషనర్ వైశాలి జాదవ్ చెప్పారు. ఇప్పటికే కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
కేరళకు చెందిన ఆనంద కె. రాసిలా రాజు పూణేలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో పని చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇన్ఫోసిస్ భవనం తొమ్మిదవ అంతస్తులో విధులలో ఉన్నారు.
బెంగళూరుకు చెందిన తన టీమ్ తో ఆన్ లైన్ లో పని చేస్తున్న సమయంలో కంప్యూటర్ వైర్ తో గుర్తు తెలియని వ్యక్తి ఆనంద కె. రసిలా రాజు మెడకు ఉరి బిగించి హత్య చేశారు. దాదాపు అదే సమయంలో ఆనంద కె. రసిలా రాజు మేనేజర్ ఆమెకు ఫోన్ చేశారు.
ఆనంద కె. రసిలా రాజు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మేనేజర్ వెంటనే సెక్యూరిటీ గార్డ్ ను అలర్ట్ చేశారు. సెక్యూరిటీ గార్డ్ వెళ్లి చూడగా ఆమె అపస్మారక స్థితిలో పడివున్నట్లు గుర్తించి మేనేజర్ కు సమాచారం అందించారు.
ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆనంద కె. రసిలా రాజు హత్యకు గురైందని, రాత్రి 8 గంటలకు తమకు సమాచారం ఇచ్చారని పూణే అసిస్టెంట్ కమిషనర్ వైశాలి జాదవ్ మీడియాకు చెప్పారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని వైశాలి జాదవ్ తెలిపారు.