రాంపాల్: పాలతో స్నానం, వాటితో కీర్, భక్తులకు పంపిణీ
బర్వాలా: వివాదాస్పద బాబా రాంపాల్పై జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆయనను బుధవారం రాత్రి అరెస్టు చేసిన తర్వాత అందుకు సంబంధించిన వార్తాకథనాలు మీడియాలో విరివిగా కనిపిస్తున్నాయి. రాంపాల్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే త్రిమూర్తులను తిరస్కరించి, కబీర్ను మాత్రమే దేవుడిగా భావించాలని చెప్పేవారు.
ఆ కథనాల ప్రకారం - రాంపాల్ పాలతో స్నానం చేసేవాడని, ఆ పాలతో ఖీర్ తయారు చేసి ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేసేవారని అంటున్నారు. హర్యానాలో రాంపాల్ ఆశ్రమం 12 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాన్ని రాష్ట్ర పాలనా యంత్రాంగం తన చేతుల్లోకి తీసుకుంది. అందులో ఇప్పుడు ఎవరూ లేరు.
ఖాళీ ఆశ్రమానికి కేంద్ర సాయుధ రిజర్వ్ పోలీసు బలగాలు (సిఆర్పిఎఫ్) కాపలా కాస్తోంది. మొత్తం 33 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 12 బోర్ రైఫిళ్లు 23, 3.15 బోర్ రైఫిళ్లు పది, ఓ పిస్టల్ ఉన్నాయి. కొన్ని మొలటోవా కాక్టెయిల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం వ్యవహారంపై విచారణ జరపడానికి హర్యానా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో మరింతగా సోదాలు నిర్వహించనున్నట్లు హిసార్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ అనిల్ కుమార్ చెప్పారు. ఆపరేషన్కు ఆయనే నేతృత్వం వహించారు.
ఆశ్రమంలో భారీ సామూహిక వంట గది ఉంది. అందులో గురువారం ఉదయం వేలాది మంది భోజనం చేయడానికి వీలుంటుంది. అలాగే, పెద్ద యెత్తున ఆహార పదార్థాలను నిల్వ చేశారు. పెద్ద గ్రంథాలయం కూడా ఉంది. ఎల్ఇడి స్క్రీన్తో ఓ లెక్చర్ హాల్ ఉన్నట్లు చెబుతున్నారు.
సముదాయంలోని ఐదు అంతస్థుల భవనంలో రాంపాల్ నివాసం ఉంటారు. పోలీసులు గురువారం ఉదయం భవనంలోకి ప్రవేశించారు. వారికి స్విమ్మింగ్ పూల్ కనిపించింది. బిఎండబ్ల్యు, మెర్సిడీస్లతో పాటు ఆయనకు లగ్జరీ కార్లు ఉన్నాయి.
గురువారం ఉదయం రాపాల్ భవనం తలుపులన్నీ మూసేసి ఉన్నాయి. పోలీసులు తలుపులను, కిటికీలను బద్దలు కొట్టి నిచ్చెన్ల ద్వారా పై అంతస్థుల్లోకి వెళ్లారు. నిజానికి సముదాయంలోకి ప్రవేశించడం చాలా కష్టం. దానికి 30 అడుగుల ఎత్తుగల ప్రహరీ గోడలున్నాయి. అవి రెండు అడుగుల దళసరి కలిగి ఉన్నాయి.
పోలీసులు రాంపాల్తో పాటు 500 మంది అనుచరులను అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ప్రైవేట్ ఆర్మీకి చెందినవారు 250 మంది ఉన్నారు. అరెస్టయినప్పుడు కూడా చాలా మంది ఆయుధాలు ధరించి ఉన్నారు. దేశవ్యాప్తంగా తీవ్రమైన రోగాలతో బాధపడుతున్నవారికి నయం చేసినట్లు, చాలా కుటుంబాలను తిరిగి బాగుపరిచినట్లు రాంపాల్ చెప్పారు. తన బోధనల ద్వారా ఆ పనిచేసినట్లు ఆయన తెలిపారు.శిష్యులు మద్యం, మాంసం, గుడ్లు తీసుకోకుండా నిషేధం విధించారు. ఇతర దేవుళ్లు, దేవతల వద్ద పాడడానికి, నృత్యం చేయడాన్ని నిషేధించారు.