ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్, గ్యాంగ్ రేప్
లక్నో: ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ఇద్దరు కామాంధులు అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫ్పానగర్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ముజఫ్పానగర్ లో ఇంటర్ విద్యాభ్యాసం చేస్తున్న యువతి నివాసం ఉంటున్నది. ఈ యువతి సివిల్ లైన్స్ ప్రాంతంలోని కాలేజ్ లో చదువుతున్నది. శివం, రాహుల్ అనే ఇద్దరు నిందితులు శుక్రవారం కాలేజ్ దగ్గర ఉన్న యువతిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు.
తరువాత సమీపంలోని ఒక ఇంటిలోకి తీసుకు వెళ్లి యువతిని నిర్బంధించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. తరువాత యువతిని బయటకు పిలుచుకుని వచ్చి సమీపంలో వదిలి పెట్టి అక్కడి నుండి పరారైనారు. ఇంటికి ఆలస్యంగా వెళ్లిన యువతిని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.
ఆమె జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. తన కుమార్తెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారని యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివం, రాహుల్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇద్దరు కామాంధులు పరారైనారని పోలీసు అధికారులు తెలిపారు.