ప్రజాపోరే: 16ఏళ్ల దీక్షకు ముగింపు పలకనున్న షర్మిల
ఇంఫాల్: భద్రతా దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని పోరాటం చేస్తున్న ఉద్యమకారిణి ఇరోం షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన 16ఏళ్ల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 9న ఆమె దీక్షకు ముగింపు పలకనున్నారు.
మంగళవారం ఇంఫాల్లోని కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ .. ఇక దీక్షకు స్వస్తి పలికి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. ఇరోం షర్మిల స్వరాష్ట్రం మణిపూర్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్మీ దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని ఆమె గత 16ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
ముక్కుకు అమర్చిన పైపు ద్వారా ఎక్కిస్తున్న ద్రావణాలతోనే ఆమె జీవిస్తున్నారు. 'ఐరన్ లేడీ'గా పేరొందిన ఇరోం షర్మిల 2000, నవంబరులో దీక్ష ప్రారంభించారు. ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలో మాలోమ్ వద్ద బస్స్టాప్లో నిలబడి ఉన్న పది మందిని అస్సాం రైఫిల్స్ సైనికులు కాల్చి చంపడంపై వ్యతిరేకతతో ప్రారంభమైన ఆమె దీక్ష ఇన్నేళ్లుగా పట్టువదలకుండా సాగించారు.
కల్లోలిత ప్రాంతాల్లో 1958 నుంచి భారత ప్రభుత్వం ప్రయోగిస్తున్న ఏఎఫ్ఎస్పీఏను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ చట్టం ఒక రకంగా ఎవరినైనా చంపే హక్కును సాయుధ దళాలకు అందిస్తోంది. కాగా, ఇన్నేళ్లయినా ప్రభుత్వం నుంచి చట్టంపై ఎలాంటి స్పందన రాలేదు.
ఇటీవల సుప్రీంకోర్టు కూడా మణిపూర్ ఆర్మీకి ప్రత్యేక హక్కుల చట్టాన్ని వ్యతిరేకించింది. అక్కడి ఆర్మీకి ప్రత్యేక హక్కులు అవసరం లేదని పేర్కొంది. ఏఎఫ్ఎస్పీఏ చట్టం కింద ఇలాంటి ప్రాంతాల్లో సాయుధ దళాలకు, పోలీసులకు విచక్షణాధికారాలు ఇవ్వడం కుదరదని కోర్టు అభిప్రాయపడింది. అక్కడ జరిగిన నకిలీ ఎన్కౌంటర్లపై విచారణ జరపాలని ఆదేశించింది.