స్కానింగ్ రిపోర్టు చూసి బిత్తరపోయిన వైద్యులు: కడుపులో ఉన్నవి చూసి షాక్!
శస్త్ర చికిత్సలో ఆరు సూదులు, రెండు లోహపు ప్లేట్లు, ట్యూబ్ లైట్లు, అద్దాలు అతని కడుపు నుంచి బయటపడ్డాయి.
న్యూఢిల్లీ: యోగాతో ఏదైనా సాధ్యమని నిరూపించడానికి.. ఓ వ్యక్తి తన శరీరాన్నే ప్రయోగశాలగా మార్చుకున్నాడు. ప్రయోగాలతో సహవాసం చేస్తూనే యోగా తనను బతికిస్తోందని చెబుతున్నాడు. యోగా బతికిస్తోందని చెబుతూనే.. వైద్యుల చేత అతను శస్త్ర చికిత్స చేయించుకోవడం గమనార్హం.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఢిల్లీలోని అశోక్ విహార్ కు చెందిన శైలేంద్ర సింద్ర(52)కు కొంతకాలం క్రితం తీవ్ర కడుపునొప్పి రావడంతో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. శైలేంద్ర సింద్రను పరీక్షించిన వైద్యులు కొన్ని స్కానింగ్స్ తీశారు. ఈ స్కానింగ్స్ లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
అతని కడుపులో ట్యూబ్ లైట్లు, బ్లేడ్లు, ఇనుప వస్తువులు, అద్దాలు వంటి వస్తువులు కనిపించాయి. దీంతో కొన్నిరోజుల పాటు యాంటీ సైకోటిక్ థెరపీ అందించి.. ఆపై శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్సలో ఆరు సూదులు, రెండు లోహపు ప్లేట్లు, ట్యూబ్ లైట్లు, అద్దాలు అతని కడుపు నుంచి బయటపడ్డాయి. యోగ ద్వారా దేన్నైనా కరిగించవచ్చునన్న ఉద్దేశంతో ఇవన్నీ తిన్నట్లు శైలేంద్ర చెప్పాడు.
నాలుగు నెలల శ్రమ అనంతరం ఈ శస్త్ర చికిత్స చేశామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శైలేంద్ర ఆరోగ్యం కుదుటపడినట్లు పేర్కొన్నారు. దీనిపై శైలేంద్ర స్పందిస్తూ.. 'నేను సైన్యంలో చేరాలనుకున్నాను.. కానీ నా పేగుల్లో సమస్య ఉందని, బతకడం కష్టమని చెప్పడంతో ఆశ వదిలేసుకున్నాను. యోగాతో ఏదైనా సాధ్యమని విన్న తర్వాత.. దాదాపు తిమ్మిదేళ్ల క్రితం లోహాలు, అద్దాలు, బ్లేడ్లు, సూదులు మింగాను. యోగా వల్లే ప్రాణాలతో ఉన్నాను' అంటూ వివరించాడు.