నోట్ల రద్దుపై మోడీ ప్రభుత్వంపై సుప్రీం ప్రశ్నల వర్షం, కీలక వ్యాఖ్యలు
రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన సుప్రీం కోర్టు శుక్రవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యున్నత న్యాయస్థానం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన సుప్రీం కోర్టు శుక్రవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. పెద్ద నోట్లను రద్దు చేయాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది. ఈ నిర్ణయాన్ని రహస్యంగా ఉంచారా అని అడిగింది. సుప్రీం కోర్టు కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. తొమ్మిది ప్రశ్నలు వేసింది.
నోట్ల రద్దుపై మోడీ ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం
పెద్ద నోట్లను రద్దు చేయాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ నిర్ణయాన్ని రహస్యంగా ఉంచారా అని అడిగింది. నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధంగా తీసుకున్నదేనా అని అడిగింది.నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా సహకార బ్యాంకుల్లో పాత నోట్ల మార్పిడి, పాత నోట్ల డిపాజిట్లను ఎందుకు నిరాకరించారో చెప్పాలని అడిగింది.
విత్ డ్రా పైన పరిమితి ఎందుకు?
బ్యాంకుల నుంచి వారానికి రూ.24 వేలు మాత్రమే విత్ డ్రా చేయాలన్న పరిమితి ఎందుకు విధించారో చెప్పాలని అడిగింది. నగదు రద్దుకు, పరిమితికి సంబంధం ఏమిటని ప్రశ్నించింది. నోట్ల రద్దు ప్రయోజనాలు ఏమిటో చెప్పాలని అడిగింది.
నోట్ల రద్దుపై విచారణ
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు ఈ రోజు విచారించింది. సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్, కేంద్రం తరఫున అటార్నీ జనరల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల14వ తేదీకి వాయిదా వేసింది.
సౌకర్యాలు తొలగించే ప్రయత్నాలు..
ప్రజల అసౌకర్యాన్ని తొలగించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని రోహత్గీ తెలిపారు. నల్ల ధనం పైన పోరాటం, తీవ్రవాదులకు నిధులు అందకుండా చేయడం వంటి కారణాల రీత్యా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు రోహత్గీ చెప్పారు.ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు బడుతున్నారని, ఏటఎంలలో సాఫ్టువేర్ పని చేయడం లేదని ప్రశాంత్ భూషణ్ వాదించారు. కొత్త నోట్ల పంపిణీ విషయంలో సహకార బ్యాంకుల పట్ల పక్షపాతం చూపారన్నారు. ఇరు పక్షాల వాదనల అనంతరం వాయిదా పడింది.