ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లి ఉగ్రవాదిగా మారాడు, ఎదురుకాల్పుల్లో మృతి
హైదరాబాద్: ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఎంఎస్ విద్యార్ధి ఒకరు విదేశాల్లో ఐఎస్ఐఎస్ సంస్ధ కార్యకలాపాల్లో పాల్గొంటూ మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. నిఘా వర్గాల సమాచారంతో ఇక్కడి పోలీసులు ఆ విద్యార్ధి కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మంచిర్యాలకు చెందిన హఫీజ్ అనే విద్యార్థి ఎంఎస్ చదివేందుకు మూడు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాదులతో సంబంధాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆ సంస్ధ తరుపున పలు దేశాల్లో కార్యకలాపాల్లో నేరుగా పాల్గొని ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డాడని నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది.
తన కుమారుడికి ఐఎస్ఐఎస్ సంబంధాలు ఉన్న విషయం కుటుంబీకులకు, బంధువులు, స్నేహితులకు తెలియదు. నాలుగునెలల క్రితం హఫీజ్ స్వస్థలం మంచిర్యాలకు వచ్చాడు. తల్లిదండ్రులు కోరిక మేరకు ఒకమ్మాయితో నిశ్చితార్ధం జరిగింది. అనంతరం అమెరికా వెళ్లాడు.
మార్చి 15న తల్లిదండ్రులకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ నుంచి ఓ ఫోన్కాల్ వచ్చింది. అందులో ఉగ్రవాదే కాల్పులు, ఎదురుకాల్పుల్లో హఫీజ్ చనిపోయాడని వారు తెలిపారు. ఈ విషయాన్ని హఫీజ్ తల్లిదండ్రులు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. అమెరికా చదువుకునేందుకు వెళ్లిన తమ కుమారుడు ఇలా ఐఎస్ఐఎస్లో చేరతాడని అనుకోలేదని తల్లిదండ్రులు వాపోయారు.
అయితే నిఘా వర్గాలు మాత్రం హఫీజ్ ఐఎస్ఐఎస్లో చేరిన విషయం కుటుంబీకులకు తెలుసని అంటున్నాయి. హఫీజ్ మరణించిన విషయాన్ని కుటుంబీకులు దాచిపెట్టినా నిఘా వర్గాలు మాత్రం చాకచక్యంగా కనిపెట్టాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, దర్యాప్తు సంస్థలు, నిత్యం వివిధ దేశాల్లోని దర్యాప్తు సంస్థలతో టచ్లో ఉండే నిఘావర్గాల సమాచారంతోనే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
రెండు రోజుల క్రితం ఈ విషయాన్ని రాష్ట్ర నిఘావర్గాలకు తెలియ చేయడంతో వారు హుటాహుటిన హఫీజ్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హఫీజ్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడిగా ఎప్పుడు మారాడు? ఏయే దేశాల్లో కార్యకలాపాలు సాగించాడన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. దీంతో పాటు ఐఎస్ఐఎస్లో మరి ఎవరినైనా రిక్రూట్ చేసి ఉంటాడా? అనే కోణంలో నిఘావర్గాలు దర్యాప్తు జరుపుతున్నాయి.