బెంగళూరులో ఐటీ సోదాలు: రూ.5 కోట్ల కొత్త కరెన్సీ, కిలోల కొద్ది బంగారం సీజ్
ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం నాడు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో రూ.4 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు: ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం నాడు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో రూ.5 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు బెంగళూరులో నివాసం ఉంటున్న ఇద్దరు అధికారుల ఇళ్లలో నిర్వహించారు.
ఇద్దరు సీనియర్ అధికారుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడంతో పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఆ ఇద్దరు అధికారుల వద్ద మరింత కొత్త కరెన్సీ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆ దిశలోను విచారణ జరుపుతున్నారు.
తాము సోదాలు నిర్వహించామని, పెద్ద మొత్తంలో డబ్బులు సీజ్ చేశామని ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీతో పాటు ఐదు కిలోల బంగారు ఆభరణాలు, ఓ ఖరీదైన కారును గుర్తించారు.
కాగా, ఐటీ అధికారులు గత రెండు రోజులుగా బెంగళూరులోని వివిధ ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. పలువురు అధికారుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. బుధవారం నాడు కూడా సోదాలు నిర్వహించారు. నిన్న ముఖ్యమంత్రికి దగ్గరివాడైన ఓ అధికారి ఇంటి పైన కూడా సోదాలు నిర్వహించారు.