మేం మనుషులం కాదా, అవును అతనిపై అరిచా: కపిల్ శర్మ
ప్రముఖ హిందీ కమేడియన్ కపిల్ శర్మ తన తోటి కమేడియన్ సునీల్ గ్రోవర్పై చేయి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చారు.
ముంబై: ప్రముఖ హిందీ కమేడియన్ కపిల్ శర్మ తన తోటి కమేడియన్ సునీల్ గ్రోవర్పై చేయి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చారు.
మా బృందంతో ఎంజాయ్ చేస్తున్నానని, ఇంతలో ఉన్నట్లుండి తనకు సునీల్ గ్రోవర్కు మధ్య పెద్ద గొడవ జరిగిందని వార్తలు వచ్చాయని, ఈ వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు.
ఏ ఉద్దేశంతో వీటిని సృష్టిస్తున్నారని, ఒకవేళ తాను విమానంలో సునీల్ని కొట్టి ఉంటే అది ఎవరు మీకు చెప్పారని, అలా చెబితే నమ్మేస్తారా, ఇలాంటి పుకార్లంటే కొందరికి చాలా ఇష్టమని, తాము కలిసే తింటామని, కలిసే ప్రయాణిస్తామని, ముఖ్యంగా సునీల్ అంటే తనకు చాలా ఇష్టమని, గౌరవమని కపిల్ శర్మ చెప్పారు.
నిజమే ఆయనతో నేను గొడవపడ్డానని, కానీ మేము మాత్రం మనుషులం కాదా, అయిదేళ్లలో తొలిసారి తాను ఆయనపై అరిచానని, ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతుంటాయని, ఈ విషయాన్ని మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుంటామని, అంతమాత్రాన తప్పుడు ప్రచారాలు చేయాలా అన్నారు.
సునీల్ నాకు అన్నయ్యలాంటివాడని, తనకు మీడియాపై గౌరవం ఉందని, దీని కంటే చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, ఇది తమ కుటుంబ సమస్య అని, దీనిని మేమే పరిష్కరించుకుంటామన్నారు.
కాగా, కపిల్ శర్మ తన సహ నటుడి పట్ల దురుసుగా ప్రవర్తించి అతనిపై చేయిచేసుకున్నాన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ద కపిల్ శర్మ షోలో సహ కమెడియన్గా వ్యవహరిస్తున్న సునిల్ గ్రోవర్తో కపిల్ గురువారం ఆస్ట్రేలియా నుంచి ముంబై వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
టూర్ నిమిత్తం కపిల్ తన షో బృందంతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు కపిల్, సునిల్కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని, దాంతో విమానంలోనే అందరిముందు కపిల్ సునిల్తో అసభ్యంగా మాట్లాడి కొట్టాడని, సునిల్ తన పనిలో తానుంటే కపిల్ దాడి చేశాడని, అందరూ చూస్తున్నారని సునిల్ నోరెత్తకుండా కూర్చుండిపోయాడని తోటి ప్రయాణికులు మీడియాకు తెలిపారు.
ఆ సమయంలో కపిల్ బాగా తాగేసున్నాడని అతని కేకలు విని విమాన సిబ్బంది చేతులు కట్టేసి అతని సీటులో కూర్చోపెట్టారని తెలిపారు.