పాక్ దుర్మార్గం: బార్డర్ పౌరులే లక్ష్యంగా పదేపదే కాల్పులు, యువతి మృతి
శ్రీనగర్: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన చట్టాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది. మంగళవారం నాడు పాక్ రేంజర్లు మరోసారి కాల్పులు జరిపారు. సాధారణ పౌరులే లక్ష్యంగా వాళ్లు కాల్పులు జరుపుతూ దురాఘతానికి పాల్పడుతున్నారు.
రాంఘర్ సెక్టారులో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారని తెలుస్తోంది. మరో ఎనిమిది మంది పౌరులకు గాయాలయ్యాయి. సరిహద్దు వద్ద సాధారణ పౌరులను టార్గెట్గా చేసుకోవడం గమనార్హం. సరిహద్దులో వరుసగా కాల్పులు చోటు చేసుకుంటుండటంతో ఉద్రిక్తత కనిపిస్తోంది.
ఈ రోజు ఉదయం నుంచి నిరంతర కాల్పులు జరుగుతున్నాయి. వీటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. రాజౌరి, రాంఘర్, అర్నియా తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. రాంఘర్లో జరిగిన కాల్పుల్లో ఓ 19 ఏళ్ల యువతి రోజీ కూడా చనిపోయాడని తెలుస్తోంది. ఈమెది జెర్దా జిల్లా.
మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయానికి పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ జమ్ము ఫ్రాంటియర్ డిఐజి ధర్మేంద్ర పరేఖ్ చెప్పారు. ఆ తర్వాత నాలుగైదు సెక్టార్లలో కాల్పులు జరిపారన్నారు. రాంఘర్, అర్నియాలతో పాటు శాంబా, జమ్ము జిల్లాల్లోను కాల్పులు జరిగాయన్నారు. ఫిరంగులతోను కాల్పులు జరుపుతున్నారన్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు తగిన జవాబిస్తున్నారని చెప్పారు.