2ఫ్యామిలీలేనా: కాశ్మీర్లో మోడీ, ములాయంకు విషెస్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన కిష్టావర్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో రెండు కుటుంబాల నుంచి మాత్రమే నాయకులు వస్తున్నారని అన్నారు.
మిగితా కుటుంబాల్లో నాయకులు లేరా అని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. కాశ్మీరీ శరణార్థుల సమస్యలను పరిష్కరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, కాశ్మీర్ను కాశ్మీర్గానే పరిగణించాలని మోడీ అన్నారు.
కాశ్మీర్ ప్రజలు పాకిస్థాన్తో చర్చల విషయంతోనే అలసిపోయారని, ఇప్పుడు వారు అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. అవినీతి ప్రస్తుతం పెద్ద సమస్యగా మారిందని, అవినీతి రహిత ప్రభుత్వం ప్రజలకు ఎంతో అవసరమని మోడీ చెప్పారు. రాష్ట్రంలో మార్పునకు ఇది కీలక సమయమని, అభివృద్ధి చెందిన కాశ్మీర్ను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరముందని అన్నారు.
ములాయంకు మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు
శనివారం 75వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్న సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మోడీ ట్విట్టర్ ద్వారా ములాయంకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్లో ములాయం సింగ్ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి.
శనివారం రాంపూర్లో ములాయం సింగ్ యాదవ్ 75 అడుగుల భారీ కేక్ను కట్ చేశారు. ఇక్కడ ములాయంకు స్వాగతం పలికేందుకు రెండు వందల స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన భగ్గీలో ఊరేగించారు.
ఈ కార్యక్రమానికి ములాయం కుమారుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సుమారు 40మంది రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ములాయం పుట్టిన రోజు వేడుకల ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి అజంఖాన్ దగ్గరుండి పర్యవేక్షించారు.