నల్లధన లిస్ట్లో యూపీఏ మంత్రి?: బెదిరించొద్దని అజయ్
న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచిన వారి జాబితాలో గత యూపీఏ ప్రభుత్వంలోని మంత్రి ఒకరు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలిచ్చారు. నల్ల కుబేరుల జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోని మంత్రులు ఎవరైనా ఉన్నారా? అని టైమ్స్ నౌ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అరుణ్ జైట్లీ బుధవారం నర్మగర్భంగా సమాధానమిచ్చారు.
నేను ధ్రువీకరించడం లేదని, అలాగని ఖండించడం కూడా లేదని, నవ్వుతో ఈ విషయాన్ని ఇక్కడితో వదిలివేస్తున్నానంతే అని, ఈ వివరాల కోసం తగిన సమయం ఆసన్నమయ్యేవరకు వేచి ఉండండి ఆయన వ్యాఖ్యానించారు. నల్లకుబేరుల జాబితాను తాను మీడియాకు ఇవ్వలేనని, ఇస్తే ఆ దేశంతో ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించిన వాడిని అవుతానని చెప్పారు.
ఇలాంటి విషయాలను మీడియాకు లీక్ చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని జైట్లీ చెప్పారు. అభియోగాలను రుజువు చేయగలిగినప్పుడు మాత్రమే కోర్టుకు పేర్లను వెల్లడిస్తామన్నారు.
ఇటువంటి వ్యవహారాల్లో రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయన్న వాదనను ఆయన తప్పుపట్టారు. ఈ వాదన పూర్తిగా తప్పని, సాధారణంగా వైరి పార్టీలోని వ్యక్తుల పేర్లు స్కాముల్లో ఉంటే బయటపెట్టడానికి బాగా ఆసక్తి చూపిస్తారు కదా? అని ఆయన అన్నారు. రాజకీయ నేతలో, మరొకరో.. ఏ వ్యక్తి పైన అయినా అభియోగాలను రుజువు చేయగలిగితే న్యాయస్థానానికి వెల్లడిస్తామన్నారు. దాంతో ఆ పేర్లు అప్పుడు బహిర్గతమవుతాయన్నారు. ఈ సమయంలో ఇంతకంటే చెప్పలేనని తెలిపారు.
బెదిరించడం కాదు.. బయట పెట్టండి: కాంగ్రెస్
నల్లకుబేరుల పేర్లను వెల్లడించే అంశంలో బెదిరింపులకు పాల్పడవద్దని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. విదేశాల్లో నల్లధనం దాచిన వారి పేర్లను వెల్లడిస్తే కాంగ్రెస్ సంకటస్థితిని ఎదుర్కొంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. దీని పైన కాంగ్రెస్ ధీటుగా స్పందించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ విలేకరులతో మాట్లాడారు.
తమను బెదిరించడానికి ప్రయత్నించవద్దని సూచించింది. నల్లధనం వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అటువంటి వారి పేర్లన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేసింది. అంతేకానీ ప్రతీకారచర్యలకు అవకాశంగా తీసుకోకూడదని హితవు పలికింది. అర్థసత్యాలతో సరిపెట్టవద్దని చెప్పారు.