బెంగళూరులో దుమ్ములేపిన తమిళ తంబీలు: జల్లికట్టు ఎఫెక్ట్
బెంగళూరు: తమిళనాడులో సాంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు నగరంలో తమిళ సోదరులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. జల్లికట్టుకు అనుమతి ఇచ్చి తమిళ సాంప్రదాయాన్ని గౌరవించాలని నినాదాలు చేశారు.
బెంగళూరు నగరంలో లక్షలాది మంది తమిళ ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న వారిలో కొన్ని వేల మంది సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సొంత ఊర్లకు వెళ్లి తిరిగి బెంగళూరు చేరుకున్నారు. జల్లికట్టును నిషేదించడంతో తమిళనాడులో గత నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
గురువారం బెంగళూరు నగరంలో ఉంటున్న తమిళ సంఘాలు, కన్నడ సంఘాలు, సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న తమిళ ఉద్యోగ సంఘాల నాయకుల పిలుపుమేరకు కొన్ని వేల మంది తమిళ ప్రజలు ఇక్కడి టౌన్ హాల్ ముందు గుమికూడారు.
జల్లికట్టు దెబ్బ: ప్రధాని మోడీతో పన్నీర్ సెల్వం: ఏం చెప్పారంటే!
ఎన్నో సంవత్సరాల నుంచి సంక్రాంతి పండగ పర్వదినం రోజు జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ అని ఇదే సందర్బంలో తమిళ సంఘాల నాయకులు గుర్తు చేశారు. అలాంటి సాంప్రదాయ క్రీడను అడ్డుకోవడానికి కొన్ని విదేశీ శక్తులు కుట్రపన్నాయని ఆరోపించారు.
తమిళనాడులో జల్లికట్టు సాహస క్రీడ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.జల్లికట్టు సాహస క్రీడ కోసం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆర్డినెన్స్ జారీ చెయ్యాలని మనవి చేశారు.
జల్లికట్టు రద్దు కావడానికి కారణం అయిన పేటా సంస్థను నిషేదించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు టౌన్ హాల్ దగ్గర గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.