పాక్ ఐఎస్ఐ హస్తం: జల్లికట్టుపై స్వామి సంచలనం, పెట్రోలు బాంబులతో దాడులు..
జల్లికట్టు ఉద్యమంపై బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సోమవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం పోకిరీలు, నక్సలైట్ల చేతుల్లోకి వెళ్తుందని ఆగ్రహించారు.
ఢిల్లీ: జల్లికట్టు ఉద్యమంపై బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సోమవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం పోకిరీలు, నక్సలైట్ల చేతుల్లోకి వెళ్తుందని ఆగ్రహించారు. వెంటనే తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
చెన్నైలో అలజడికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంస్థ ఐఎస్ఐ నిధులు సమకూరుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు ఉద్యమాన్ని జాతి వ్యతిరేక శక్తులు తమ చేతుల్లోకి తీసుకున్నాయని మండిపడ్డారు.
హోదా కోసం ఏం చేసినా మేం ఓకే: పవన్ కళ్యాణ్ తర్వాత వైయస్ జగన్
జల్లికట్టు కోసం పోరాడిన అసలైన ఉద్యమకారులు అక్కడ లేరని, తాము మెరీనా బీచ్ వీడుతున్నట్లు ఆర్గనైజర్స్ చెప్పారని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు.
ఈ రోజు మాత్రం అక్కడున్న పలువురు నిరసనకారులు ప్రభాకరన్, హఫీజ్ సయీద్ పోస్టర్లతో కనిపించారని ఆరోపించారు. కాబట్టి ఇది ఐఎస్ఐ నిధులు సమకూర్చుతున్న ఉద్యమంగా ఇప్పుడు కనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మెరీనాను ఖాళీ చేయించి మంచి పని చేశారన్నారు.
నేను మొదటి నుంచి జల్లికట్టుకు మద్దతుగా మాట్లాడుతున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దీనిని అర్థం లేకుండా బ్యాన్ చేసిందన్నారు. కానీ తాము మాత్రం జల్లికట్టుకు మద్దతుగా ఉన్నామని చెప్పారు. అయినప్పటికీ తమకు ఇప్పుడే శాశ్వతంగా కావాలని పట్టుబట్టడం ఏమిటని ప్రశ్నించారు.
కాగా, జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలోని మెరీనా బీచ్ తీరంలో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
జల్లికట్టుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినందున ఆందోళన విరమించాలని, గణతంత్ర దినోత్సవ వేడుకలు మెరీనా బీచ్లో నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఖాళీ చేయాలని పోలీసులు ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు.
అయితే పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించిన నిరసనకారులు తమను బలవంతంగా ఖాళీ చేయిస్తే ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు.
దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు మెరీనా బీచ్ సమీపంలోని ఐస్ హౌస్ పోలీస్స్టేషన్ ప్రాంగణంలోకి చొరబడి అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో సుమారు 50 వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి.
మెరీనా బీచ్ ఆందోళన హింసాత్మకంగా మారడంతో అక్కడికి వచ్చే అన్ని మార్గాలను పోలీసులు మూసివేయించారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఆందోళనకారులను వెనక్కి పంపించారు.
కేంద్రం నుంచి చెన్నైకి బలగాలు... కర్వ్ూ వాతావరణం
చెన్నైలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. మెరీనా బీచ్ నుంచి చెన్నైలో పలు ప్రాంతాల్లో ఆందోళన, హింసాత్మకం కనిపిస్తోంది. దీంతో కేంద్రం నుంచి మరిన్ని బలగాలను రప్పిస్తున్నారు. పలుచోట్లకు అల్లర్లు పాకడం, పెట్రోలు బాంబులతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.