పులులు, ఏనుగులను దత్తత తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డి..
పులి పిల్లల తర్వాత ఏనుగు పిల్లను దత్తతకు తీసుకున్నారు. దానికి తన ఆత్మీయ మిత్రుడు, బీఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎంపీ శ్రీరాములు పేరు పెట్టారు.
బళ్లారి: గతేడాది నోట్ల రద్దు సమయంలోను వందల కోట్ల రూపాయల ఖర్చుతో కుమార్తె పెళ్లిని వైభవంగా జరిపించి గాలి జనార్దన్ రెడ్డి వార్తల్లో నిలిచారు. తాజాగా మరోసారి ఈ మైనింగ్ కింగ్ వార్తల్లోకి ఎక్కారు. పులి పిల్లలను, ఏనుగు పిల్లలను గాలి జనార్దన్ రెడ్డి దత్తత తీసుకోవడమే ఇందుకు కారణం.
బెంగుళూరు సమీపంలో ఉన్న బన్నేరుఘట్ట ' నేషనల్ జూ'ను గతవారం గాలి జనార్థన్ రెడ్డి సందర్శించారు. ఆ సమయంలోనే జంతువులను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం నాడు మరోసారి ఆయన 'జూ'ను సందర్శించారు.
ఈ సందర్భ:గా 'జూ'లోని మూడు పులి పిల్లలను, ఒక ఏనుగును ఆయన దత్తత తీసుకున్నారు. తొలుత మూడు పులి పిల్లలను దత్తత తీసుకున్న ఆయన.. వాటికి అరణ్య, శాంభవి అని మగ పులికి శివ అని పేరు పెట్టారు.
పులి పిల్లల తర్వాత ఏనుగు పిల్లను దత్తతకు తీసుకున్నారు. దానికి తన ఆత్మీయ మిత్రుడు, బీఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎంపీ శ్రీరాములు పేరు పెట్టారు. వీటి పోషణార్థం జూ రూ. 4.75 లక్షలు చెల్లించారు. ఇందులో ఏనుగు పోషణార్థం రూ.1.75లక్షలు చెల్లించగా, పులి పిల్లలకు తలో రూ.1లక్ష ఖర్చు చేయనున్నారు. సంవత్సరం వరకు వాటికి అయ్యే ఖర్చులను గాలి జనార్థన్ రెడ్డి భరించనున్నారు.
వీటితో పాటు ప్రతీ ఏటా మరిన్ని జంతువులను దత్తత తీసుకుంటానని గాలి జనార్థన్ రెడ్డి ప్రకటించడం విశేషం. కాగా, గతంలో అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, ఎంఎస్ ధోని, జహీర్ ఖాన్ వంటి క్రికెటర్లు మైసూరు 'జూ'లోని కొన్ని జంతువులను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.